తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా బుర్రా వెంకటేశం

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. నూతన చైర్మన్‌ నియామకానికి రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ శనివారం ఆమోదముద్ర వేశారు.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. నూతన చైర్మన్‌ నియామకానికి రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ శనివారం ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఎం మహేందర్‌రెడ్డి డిసెంబర్‌ 2వ తేదీతో పదవీ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్‌గా బుర్రా వెకంటేశంను ప్రభుత్వం నియమించింది. కొత్త చైర్మన్‌ నియామకానికి సర్కారు గతంలోనే నోటిఫికేషన్‌ జారీచేసి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 45 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో రిటైర్డ్‌ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు ఉన్నారు. వారిలో చైర్మన్‌ పోస్టుకు బుర్రా వెంకటేశంను ఎంపికచేసిన సర్కారు ఈ నియామకం ఆమోదం కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించింది. దీంతో గవర్నర్‌ శనివారం ఆ ఫైల్‌పై ఆమోదముద్ర వేశారు. బుర్రా వెంకటేశంకు మరో మూడున్నరేండ్ల సర్వీసు ఉండగా, టీజీపీఎస్సీ చైర్మన్‌గా 62 ఏండ్ల వరకు కొనసాగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్‌ ఐదున్నరేండ్లు అంటే 2030 వరకు కొనసాగనున్నారు. బుర్రా వెంకటేశం ప్రభుత్వ బడిలో, గురుకులంలో చదువుకుని అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుత టీజీపీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డితోపాటు బుర్రా వెంకటేశం సైతం సర్వేల్‌ గురుకుల పూర్వ విద్యార్థి కావడం గమనార్హం. ట్యూషన్‌ టీచర్‌గా తన ప్రస్తానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగిన బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్‌గా అత్యున్నత స్థానానికి ఎదిగారు. బుర్రా వెంకటేశం డిసెంబర్‌ 2న లేదా ఆ తర్వాత చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి.