తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ధరణి సేవలు బంద్‌

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ధరణి పోర్టల్‌ సేవలు బంద్‌ కానున్నాయి. డేటాబేస్‌ వర్షన్‌ అప్‌గ్రేడ్‌ చేయనున్న నేపథ్యంలో ధరణి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ సోమవారం ఉదయానికి ఈ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ ముగియనుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ధరణి సేవలు అందుబాటులో ఉండవని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

నిజానికి గత మూడు రోజుల నుంచే ధరణి సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధవారం నుంచి ధరణి ఓటీపీలు కూడా రావడం లేదని మీ సేవా నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. అంతకంటే ముందు రెండు రోజులు ధరణి పోర్టల్‌ ద్వారా కేవలం సేల్‌ డీడ్‌ మాత్రమే అయ్యాయని చెబుతున్నారు. టీఎం 33, గిఫ్ట్‌ డీడ్స్‌ వంటి మాడ్యుల్స్‌ పనిచేయలేదని అంటున్నారు.