రసాయన గోదాంలో పేలుడు

 కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం, దూలపల్లి పారిశ్రామికవాడలో అక్రమంగా నిల్వ చేస్తున్న కెమికల్‌ గోదాంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంట లు ఎగిసిపడ్డాయి. ఈ సంఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం.. దూలపల్లి ఇండస్ట్రీయల్‌ ఏరియాలోని రిషిక కెమికల్‌ గోదాంలో నిల్వ ఉన్న కెమికల్‌ డ్రమ్ములు శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పేలాయి.

దీంతో కెమికల్‌ డ్రమ్ములకు, ప్లాస్టిక్‌ వ్యర్థాలకు మంట లు అంటుకుని పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. అయితే.. అందులో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు బయటకు రావడంతో ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. సమాచారం అందుకున్న రెండు ఫైరింజన్లు వచ్చి మంటలు ఆర్పాయి. కాగా.. గోదాంలో అక్రమం గా కెమికల్స్‌ను నిల్వ చేయడం మూలంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేట్‌ బషీరాబాద్‌ సీఐ విజయవర్ధన్‌ తెలిపారు.