తిరుపతి తొక్కిసలాట మృతులకు ఏపీ ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం

తిరుపతిలో తొక్కిసలాట మృతులకు రూ. 25 లక్షల పరిహారం అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా 48 మంది గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి చెందిన మంత్రులు మృతుల కుటుంబ సభ్యులను, ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

అనంతరం ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి సత్యగాని ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఘటన ప్రమాదమా.. కుట్రా అనే కోణంలో విచారణ చేపడుతామని వెల్లడించారు. ఎవరి వైఫల్యం ఉందో అనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని అన్నారు.

బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరుగకుండా చూస్తామని పేర్కొన్నారు. మంత్రి నిమ్మల రామోహ్మన్‌నాయుడు మాట్లాడుతూ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రకటించారు.