శ్రీరామ నవమి శోభాయాత్ర.. ఈ రూట్లలో రాత్రి 9 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

 శ్రీరామ నవమి శోభాయత్ర సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రాత్రి 9 గంటల వరకు సీతారాంబాగ్‌ ఆలయం నుంచి హనుమాన్‌ వ్యాయామశాల స్కూల్‌, సుల్తాన్‌బజార్‌ మీదుగా బోయిగూడ కమాన్‌, మంగల్‌హాట్‌ పీఎస్‌ రోడ్డు, జాలి హనుమాన్‌, ధూల్‌పేట, పురానాపూల్‌, గాంధీ విగ్రహం, జుమేరత్‌ బజార్‌, చుడీ బజార్‌, బేగంబజార్‌ ఛత్రి, బర్తన్‌ బజార్‌, ఎస్‌ఏ బజార్‌ మసీదు, శంకర్‌ షేర్‌ హోటల్‌, గౌలిగూడ కమాన్‌, రామమందిల్‌ కమాన్‌, పుత్లిబౌలి ఎక్స్‌ రోడ్‌, ఆంధ్రా బ్యాంక్‌ ఎక్స్‌రోడ్‌, డీఎం హెచ్‌ ఎక్స్‌ రోడ్‌, సుల్తాన్‌ బజార్‌ ఎక్స్‌ రోడ్‌, రాయల్‌ ప్లాజా టీ జంక్షన్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయా రూట్‌లలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు.

కాగా, శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా చారిత్రాత్మక సీతారామ్‌బాగ్‌ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేశ్‌ వర్మ యాత్రను ప్రారంభిస్తారు. భాగ్యనగర్‌ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సాగే ఈ యాత్ర సీతారామ్‌బాగ్‌ నుంచి కోఠి హనుమాన్‌టేక్డీ వరకు కొనసాగుతుంది. ఇక ఆనంద్‌సింగ్‌ ఆధ్వర్యంలో ధూల్‌పేట మాగ్రా నుంచి శ్రీరామ నవమి పాల్కీ యాత్రను మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్సీ కవిత ప్రారంభిస్తారు. అదేవిధంగా గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆధ్వర్యంలో మరో యాత్ర సాగుతుంది. ధూల్‌పేట గంగాబౌలి నుంచి కోఠి హనుమాన్‌ టెక్డీ వరకు సాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు యాత్రను రాజాసింగ్‌ ప్రారంభిస్తారు.

ఈ మూడు యాత్రలు మంగళ్‌హాట్‌ ప్రధాన రోడ్డులోని అనిత టవర్‌ వద్ద కలుస్తాయి. పురానాపూల్‌, జుమ్మేరాత్‌ బజార్‌, చుడీబజార్‌, బేగంబజార్ ఛత్రి, సిద్ది అంబర్‌ బజార్‌, గౌలిగూడ, పుత్లీబౌలి మీదుగా కోఠీ హనుమాన్‌ టేక్డీ వరకు కొనసాగుతాయి. ఊరేగింపులో శ్రీరాముడితోపాటు పలు దేవుళ్ల విగ్రహాలుంటాయి.

ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో వాహనాలను ఇతర ప్రాంతాల మీదుగా పోలీసులు దారిమళ్లిస్తున్నారు. సీతారామ్‌బాగ్‌కు వచ్చే వాహనాలను మల్లేపల్లి, నాంపల్లి మీదుగా దారిమళ్లిస్తారు. బోయిగూడ కమాన్‌ నుంచి దారుసలాం ఆగాపురా మీదుగా, పురానాపూల్‌ నుంచి వాహనాలను జియాగూడ కార్వాన్‌ వైపు, బేగంబజార్‌ నుంచి వచ్చే వాహనాలను గోషామహల్‌, ఇతర ప్రాంతాలకు దారిమళ్లిస్తున్నారు.