భారతీయులంతా ఐక్యంగా ఉండటం చాలా అవసరమని, తద్వారా ఉగ్ర చర్యలను, వారి లక్ష్యాలను దీటుగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Terror attack) ని విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని, ఈ దాడికి ప్రతిగా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా తాము మద్దతిస్తామని ఆయన స్పష్టంచేశారు. ఇవాళ శ్రీనగర్లో పర్యటించిన రాహుల్ గాంధీ.. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్తో, సీఎంతో భేటీ అయ్యారు. అనంతరం ఉగ్రదాడి బాధితులను కలిసి మాట్లాడారు.
సమాజాన్ని ముక్కలు చేయడం, సోదరుల మధ్య తగాదాలు సృష్టించడమే ఉగ్రవాదుల పని అని రాహుల్గాంధీ అన్నారు. భారతీయులంతా ఐక్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. కశ్మీర్తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిపై కొందరు దాడులు చేయడం అత్యంత బాధాకరమని, మనందరం ఐక్యంగా ఉండి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తాను లెఫ్టినెంట్ గవర్నర్తో, ముఖ్యమంత్రితో భేటీ అయ్యానని, దాడి గురించి వారు వివరించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని వారిద్దరికీ తాను హామీ ఇచ్చానని తెలిపారు.