తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

 తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2.15 గంటలకు రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ప‌ది ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 91.32 శాతం, బాలిక‌లు 94.26 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. బాలిక‌లు బాలుర కంటే 2.94 శాతం అధికంగా ఉత్తీర్ణ‌త సాధించారు.

ఇక ఈ ఏడాది 4,629 స్కూల్స్ 100 శాతం ఉత్తీర్ణ‌త సాధించాయి. రెండు పాఠ‌శాల‌లు మాత్రం సున్నా శాతం ఫ‌లితాలు పొందాయి. మ‌హ‌బూబాబాద్ జిల్లా 99.29 శాతంతో అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా, వికారాబాద్ జిల్లా 73.97 శాతంతో చివ‌రి స్థానంతో స‌రిపెట్టుకుంది. తెలంగాణ గురుకుల పాఠ‌శాల‌లు 98.79 శాతం ఉత్తీర్ణ‌త సాధించాయి. ఎయిడెడ్, జ‌డ్పీ, గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్ రాష్ట్ర స‌రాస‌రి ఉత్తీర్ణ‌తా శాతం 92.78 కంటే త‌క్కువ ఉత్తీర్ణ‌త సాధించాయి.

సీజీపీఏ విధానాన్ని తొలగించిన నేపథ్యంలో సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడింగ్స్ ఇచ్చారు. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 5లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.