లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) గడువును ప్రభుత్వం మరో మూడు రోజులు (మే 3 వరకు) పొడిగించింది. ముందు నిర్ణయించిన ప్రకారం బుధవారంతో గడువు ముగిసిన ఈ పథకంలో సుమారు 20 లక్షల మంది ఫీజు చెల్లించాల్సిన దరఖాస్తుదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు కేవలం 6 లక్షల మందే ఫీజు చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో కనీసం నెల రోజులు గడువు పెంచాలని పురపాలక శాఖ అధికారులు ప్రతిపాదించారు. తొలుత మే 15 వరకు మాత్రమే గడువు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆ తరువాత కేవలం 3 రోజులే ‘గ్రేస్ పీరియడ్’గా పేర్కొంటూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇది సరిపోదని, కనీసం నెల రోజులు పెంచాలని అధికారులు కోరారు. దీనిపై ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎల్ఆర్ఎ్సలో ఇప్పటి వరకు రూ.1,890 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో సీడీఎంఏ పరిధిలోని మునిసిపాలిటీల నుంచి వచ్చిందే రూ.1,229 కోట్లు. గ్రామ పంచాయతీల నుంచి రూ.193 కోట్లు, అర్బన్ డెవల్పమెంట్ అథారిటీల (యూడీఏ) నుంచి రూ.64 కోట్లు, జీహెచ్ఎంసీ నుంచి రూ.170, హెచ్ఎండీఏ నుంచి రూ.234 కోట్లు వసూలైంది. సీడీఎంఏ పరిధిలో అత్యధిక ఆదాయం రాగా.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఆశించిన మేర ఆదాయం సమకూరలేదు. మార్చి నుంచి అమలులో ఉన్న ఎల్ఆర్ఎస్ గడువును ఇప్పటికే ఒకసారి ఏప్రిల్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.