ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంలో తెలంగాణ పోలీసు విభాగం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. మాదకద్రవ్యాల నిరోధానికి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కేసుల్లో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టడం లేదని, విదేశాల నుంచి కూడా అరెస్టు చేసి తీసుకొస్తున్నామన్నారు.
గత ఏడాది 30 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణలో కూడా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా పోలీసు కేంద్ర కార్యాలయానికి వచ్చిన డీజీపీ.. విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సైబర్ నేరాల కేసుల్లో గత ఏడాది రూ.185 కోట్లను బాధితులకు ఇప్పించగా, ఇటీవల జరిగిన జాతీయ లోక్ అదాలత్లో రూ.50 కోట్లు ఇప్పించామని తెలిపారు.