పాశమైలారం పేలుడు ఘటనలో 39కి పెరిగిన మృతుల సంఖ్య.. గుర్తుపట్టలేని స్థితిలో పలువురి మృతదేహాలు

  • 35 మందికి తీవ్ర గాయాలు, 12 మంది పరిస్థితి విషమం
  • మృతుల్లో పరిశ్రమ వైస్‌ప్రెసిడెంట్ గుర్తుపట్టని స్థితిలో మాడి మసైన మృతదేహాలు
  •  పేలుడు ధాటికి 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డ కార్మికులు
  • కుప్పకూలిన పరిశ్రమ భవనం, మరో భవనానికి బీటలు 

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీలో (Sigachi Industries) సోమవారం జరిగిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. రాష్ట్ర చరిత్రలో అతిపెద్దదిగా నిలిచిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 39 మంది మరణించారు. మరో 35 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉండగా, మరో 20 మంది కార్మికుల జాడలేదు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, మృతుల్లో ఇప్పటివరకు నాలుగురిని మాత్రమే గుర్తించగలిగారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. అయితే ఉదయం కాస్త తెరిపినివ్వడంతో మళ్లి రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో ప్లాంట్‌ మేనేజర్‌ ఎల్‌ఎన్‌ గోవన్‌ కూడా మృతిచెందారు. నాలుగు నెలలుగా విధులకు దూరంగా ఉన్న గోవన్‌ 2 రోజుల నుంచే వస్తున్నారు. కంపెనీకి వచ్చి వాహనం దిగి అడ్మినిస్ట్రేషన్‌ భవనంలోకి వెళ్తుండగానే పేలుడు సంభవించి దూరాన ఎగిరిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు.

100 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డ మంటలు

సిగాచి పరిశ్రమలోని మైక్రో క్రిస్టల్‌ సెల్యులోజ్‌ డ్రయింగ్‌ యూనిట్‌లో సోమవారం ఉదయం 9.18 గంటలకు మై భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 100 మీటర్ల ఎత్తుకు మంటలు ఎగిసిపడ్డాయి. రెండు కిలోమీటర్ల దాకా పేలుడు శబ్దం వినిపించింది. ఒక్కసారిగా భూకంపం వచ్చిందేమోనని పాశమైలారం గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటైన సిగాచి ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీ, మైక్రో క్రిస్టల్‌ సెల్యులోజ్‌ను తయారు చేస్తుంది. కాగా సోమవారం ఉదయం షిఫ్ట్‌కు కంపెనీలోకి 118 మంది కార్మికులు డ్యూటీకి వచ్చారు. వీరితోపాటు అడ్మినిస్ట్రేషన్‌ సిబ్బంది 32 మంది, సెక్యూరిటీ సిబ్బంది ముగ్గురు డ్యూటీలో ఉన్నారు. అందరూ విధుల్లో ఉండగా ఒక్కసారిగా భారీ విస్ఫోటనం జరిగింది. కంపెనీలో రియాక్టర్లు పేలడంతో వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానాలున్నాయి. రియాక్టర్ల పేలుడు ధాటికి కంపెనీలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కంపెనీ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌తో పాటు పక్కనే ఉన్న మూడంతస్థుల అడ్మినిస్ట్రేషన్‌ భవనం కుప్పకూలింది. పేలుడు సమయంలో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.

మంటలు చెలరేగటంతో కంపెనీ నలువైపులా పొగ కమ్ముకున్నది. చాలామంది కార్మికులు మంటల్లో చిక్కుకుపోయి, భవనం శిథిలాల కింద పడి చనిపోయారు. కొందరు పరుగులు తీసి ప్రమాదం నుంచి బయటపడ్డారు. అడ్మినిస్ట్రేషన్‌ భవనంలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు చనిపోయినట్టు తెలుస్తున్నది.