మాన‌వీయ కోణంలో భూ స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం చూపాలి : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • రెవెన్యూ, అట‌వీ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి
  • రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

పేద ప్రజలు ద‌శాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌కు సూచించారు.డాక్ట‌ర్ బి. ఆర్‌, అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో సోమ‌వారంనాడు న‌ల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో భూ స‌మ‌స్య‌ల‌పై మంత్రిగారు స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి కె. జానా రెడ్డి, నాగార్జున సాగర్ శాసన సభ్యులు కె. జ‌య‌వీర్ రెడ్డి, రెవెన్యూ శాఖ సెక్రటరీ డి ఎస్.లోకేష్ కుమార్, నల్గొండ కలెక్టర్ ఐలా త్రిపాఠి, అద‌న‌పు చీఫ్ క‌న్స‌ర్వేట‌ర్ ఆఫ్ ఫారెస్ట్స్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈసంద‌ర్బంగా మంత్రిగారు మాట్లాడుతూ చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ను సాకుగా చూపించి స‌మ‌స్య‌ల‌ను జ‌ఠిలం చేయ‌వ‌ద్ద‌ని అట‌వీశాఖ అధికారుల‌కు సూచించారు.

నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో 40-50 సంవ‌త్స‌రాల నుంచి సాగు చేసుకుంటున్న భూముల‌పై గిరిజ‌నుల‌కు హ‌క్కులు క‌ల్పించ‌డానికి త‌మ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ఉంద‌ని అయితే వివిధ నిబంధ‌న‌లు చూపుతూ ఆ భూములు అట‌వీశాఖకు చెందిన‌వ‌ని అట‌వీ అధికారులు కొర్రీ వేస్తున్నార‌ని అన్నారు. ఈ అంశంపై రెవెన్యూ , ఫారెస్ట్ విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్కారం చూపేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.