- లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా 60వేల మందికి ఉపాధి
- 2024- 25 లో రూ.66వేల కోట్ల ఉత్పత్తులు ఎగుమతి
- రూ.లక్ష కోట్ల పెట్టుబడితో దీర్ఘకాలిక వ్యూహం
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణ ను “గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్” మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని, ఆ క్రమంలోనే కేవలం ఏడాదిన్నరలో రూ.50వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఫలితంగా కొత్తగా 60వేల మందికి ఉపాధి లభించిందన్నారు. శుక్రవారం హైటెక్ సిటీ ట్రైడెంట్ హోటల్ లో “ఈటీ ఫార్మా టెక్ ఇన్నోవేటివ్ కాంక్లేవ్” రెండో ఎడిషన్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. “2024-25లో రూ.66వేల కోట్ల విలువైన లైఫ్ సైన్సెస్ ఉత్పత్తులను తెలంగాణ ఎగుమతి చేసింది. ప్రపంచానికి కావాల్సిన మూడింట ఒక వంతు వ్యాక్సిన్లను అందిస్తూ హైదరాబాద్ ‘వ్యాక్సిన్ రాజధాని’గా ప్రసిద్ధి చెందింది. దేశంలో అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్క్ నుంచి “మేడ్ ఇన్ తెలంగాణ” స్టెంట్లు, కేథెటర్లు యూఎస్, జపాన్ తో సహా 89 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి” అని ఈ సందర్భంగా వివరించారు. “లైఫ్ సైన్సెస్ లో గ్రామీణ, సెమీ- అర్బన్ ప్రాంతాల్లో 5 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలను కల్పించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రూ.లక్ష కోట్లతో దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహాన్ని అమలు చేయబోతున్నాం. అందరి అభిప్రాయాలను సేకరించి వికారాబాద్, నల్గొండ, మెదక్ లో ఫార్మా విలేజెస్ ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం” అని చెప్పారు. “లైఫ్ సైన్సెస్ రంగానికి అవసరమైన అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులను అందించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలోనే ‘లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇక్కడ స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను జీవ శాస్త్ర దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అందించబోతున్నాం. ఇప్పటికే ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ద్వారా డాక్టర్ రెడ్డీస్, అరబిందో లాంటి సంస్థలతో కలిసి తెలంగాణ యువతకు శిక్షణ ఇస్తున్నాం. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్(సీ4ఐఆర్) భాగస్వామ్యంతో సైన్స్ గ్రాడ్యూయేట్లకు లైఫ్ సైన్సెస్ రంగంలో నిపుణులను తీర్చి దిద్దుతున్నాం” అని పేర్కొన్నారు. “లైఫ్ సైన్సెస్ రంగంలో ‘తెలంగాణ’ బ్రాండ్ ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రత్యేకంగా ‘తెలంగాణ కాంప్రెహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ’కి శ్రీకారం చుట్టాం. ఇది చివరి దశలో ఉంది. ఈ రంగాన్ని కేవలం పరిశ్రమలు లేదా ఆర్ అండ్ డీ సెంటర్లకే మేం పరిమితం చేయడం లేదు. టెక్నాలజీ మేళవింపుతో ప్రజలకు ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం. ఇప్పటికే మూడు జిల్లాల్లో నోటి, రొమ్ము , గర్భాశయ క్యాన్సర్ల ను ముందే గుర్తించేందుకు ఏఐ ఆధారిత స్క్రీనింగ్ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. సత్ఫలితాలు రావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రులు, వైద్య కళాశాలలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం” అని వివరించారు. కార్యక్రమంలో పలు దిగ్గజ ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.