ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో టెక్స్ టైల్ రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని తైవాన్ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. శుక్రవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తైవాన్ టెక్స్ టైల్ ఫెడరేషన్(టీటీఎఫ్) అధ్యక్షుడు జస్టిన్ వాంగ్ నేతృత్వంలో 11 మంది ప్రతినిధుల బృందం మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ‘స్వల్ప కాలంలోనే టెక్స్ టైల్ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఎదిగింది. రాష్ట్ర పారిశ్రామిక జీఎస్ వీఏ 2024-25లో రూ.2.77 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో టెక్స్ టైల్ రంగం కీలక పాత్ర పోషించింది. దేశంలోనే అత్యంత నాణ్యమైన పత్తి ఇక్కడే పండుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్(కేఎంటీపీ) గేమ్ ఛేంజర్ గా మారింది. ప్రపంచ పటంలో తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తోంది’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ‘కేఎంటీపీలో జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంటింగ్ అన్నీ ఒకే చోట పూర్తి చేసేలా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశాం. టెక్స్ టైల్ దిగ్గజ కంపెనీలు యంగాన్, కైటెక్స్, గణేషా ఎకోస్పియర్ ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. రవాణా సౌకర్యాలపరంగా కూడా ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది.
హైదరాబాద్ – నాగ్ పూర్ – విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్ కు అనుసంధానంగా ఉంటుంది. ఫంక్షనల్ టెక్స్ టైల్స్, ఎకో – డైయింగ్, టెక్స్ టైల్ రీసైక్లింగ్ తదితర అంశాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి’ అని చెప్పారు. ‘అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. కస్టమైజ్డ్ ల్యాండ్ పార్సిల్స్, ప్లగ్ అండ్ ప్లే యూనిట్స్, నైపుణ్య మానవ వనరులు, సమర్థవంతమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం, భౌగోళిక పరిస్థితులు పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తున్నాయి. టెక్స్ టైల్స్, టెక్నికల్ టైక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్స్ సిస్టం డిజైన్ అండ్ మానుఫ్యాక్చరింగ్(ఈఎస్ డీఎం), సస్టైనబుల్ మానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్ అండ్ ఆర్ అండ్ డీ తదితర రంగాల్లో తైవాన్ కంపెనీలకు తెలంగాణ అనుకూలంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. తైవాన్ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే ‘తెలంగాణ – తైవాన్ మాన్యుఫాక్చరింగ్ జోన్’, ప్రత్యేక టైక్స్ టైల్ క్లస్టర్ లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. టెక్స్ టైల్ రంగం అభివృద్ధికి టీటీఎఫ్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, రాష్ట్ర టైక్స్ టైల్స్ డైరెక్టర్ ధరణి, టీటీఎఫ్ సెక్షన్ చీఫ్ ఆర్థర్ చియాంగ్, తైవాన్ కు చెందిన టైనాన్ ఎంటర్ ప్రైజ్ కంపెనీ లిమిటెడ్, లీలీ గ్రూప్, ఆల్కేమీ తైవాన్ లిమిటెట్, సింగ్ యోంగ్ హో ఎంటర్ ప్రైజ్ కంపెనీ లిమిటెడ్, ఫార్ ఈస్టర్న్ న్యూ సెంచరీ కార్పోరేషన్, లిటిల్ కింగ్ గ్లోబల్ కంపెనీ లిమిటెడ్, యూ బంగ్ ఎంటర్ ప్రైజ్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు.