బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలన్న డిమాండ్తో ఆగస్టు 8న కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఆ తరువాత ఇదే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవాలని భావిస్తోంది. ఈ విషయాలపై మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, బండ ప్రకాశ్ మంగళవారం బీఆర్ఎస్ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు బీసీల ఆధ్వర్యంలో ఆగస్టు 8న కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆ తరువాత రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి తమ పార్టీ పెద్దలను కలిస్తే ప్రయోజనం లేదని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత అధికార కాంగ్రె్సపై ఉందన్నారు. ‘ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి… బీసీ బిల్లులను ఆమోదింపచేయాలని అడిగారా? ప్రైవేటు పనులు, ప్రభుత్వ పనుల గురించి మాట్లాడటం తప్ప బీసీల పట్ల బాధ్యతగా కేంద్రంలోని పెద్దలతో సీఎం చర్చలు జరిపారా?’ అని వారు ప్రశ్నించారు. రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వెళతామంటున్న కాంగ్రెస్.. రిజర్వేషన్లు లేకుండా తిరిగి రాష్ట్రానికి రావొద్దని డిమాండ్ చేశారు. బీసీలకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ ఒక్కటేనని వారన్నారు.