నీటిపారుదల శాఖా భూముల పరిరక్షణకు అత్యవసర చర్యలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • అన్యాక్రాంతం అయిన భూములను యుద్దప్రాతిపదికన స్వాధీనం
  • భూముల చుట్టూ కంచె ఏర్పాటుకు ఆదేశాలు
  • కోర్టు కేసుల పరిష్కారానికి ప్రత్యేక సీనియర్ న్యాయవాది నియామకం
  • కోటాను కోట్ల విలువ చేసే వాలంతరి, టి.జి.ఇ.ఆర్.ఎల్ భూములలో ఆక్రమణలు తొలగించాలి
  • అన్యాక్రాంతం అయిన భూములను స్వాధీనం చేసుకునే విషయంలో కఠినత్మాకాంగ ఉండాలి
  • నీటి పారుదల శాఖ భూములలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు పరిశీలన

రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖా భూముల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములు కబ్జాకు గురైన పక్షంలో ఎంత మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆక్రమణలకు గురైన భూములను యుద్ద ప్రాతి పదికన స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ భూముల చుట్టూ కంచె ఏర్పాటు చేసే విదంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నీటిపారుదల శాఖా భూముల పరిరక్షణలో బాగంగా గురువారం మధ్యాహ్నం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో హైడ్రా, ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,హైడ్రా కమిషనర్ ఏ.వి రంగనాధ్,ఆర్&ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు,ఇ. ఎన్.సి అఫ్జల్ హుస్సేన్,ఇ.ఎన్.సి అడ్మిన్ రమేష్ బాబు వాలంతరి డైరెక్టర్ జెనరల్ అనిత,హైడ్రా ఎస్.పి అశోక్ తదితరులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా హైదరాబాద్ లోని గండిపేట,రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న గండిపేట సమీపంలోని హిమాయత్ సాగర్,కిస్మత్ పుర,కిస్మత్ పుర లతో పాటు రాజేంద్రనగర్ పరిధిలోని వాలంతరి,టి.జి.ఇ.ఆర్.ఎల్ కు చెందిన 426-30 ఎకరాలకు గాను 131-31ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించామన్నారు.అందులో ఐ.టి.ఐ.ఆర్ అధీనం లో ఉన్న 81.26 ఎకరాల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు.50.13 ఎకరాలు ఆక్రమణకు గురైందని ఆయన తెలిపారు. కాగా ఈ ఆక్రమణ లపై జిల్లా కోర్టులో 20 కేసులు పెండింగ్ లో ఉండగా హైకోర్టు లో మరో 2 కేసులు నడుస్తున్నాయన్నారు. భూములను పరిరక్షిండంలో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డా ఎదుర్కొనేందుకు నీటిపారుదల శాఖా ప్రత్యేక సీనియర్ న్యాయవాదిని నియమించనున్నట్లు ఆయన వెల్లడించారు.

కోటానుకోట్ల విలువ చేసే భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు గాను నీటిపారుదల శాఖా హైడ్రా,రెవిన్యూ,ఆర్&ఆర్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అదే విదంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల శాఖ భూములను సత్వరం గుర్తించాలని ఆయన నీటిపారుదల శాఖాధికారులకు సూచించారు
అంతే గాకుండా నీటిపారుదల క్వార్టర్స్ లో అక్రమంగా ఆక్రమించుకున్న వారిని తొలగించడం తో పాటు తక్షణమే వాటి సమగ్ర సమాచారం తన ముందుంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

నీటిపారుదల శాఖకు చెందిన అంగుళం భూమిని కుడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.భవిష్యత్ లోనూ ఆక్రమణలకు చోటు లేకుండా పరిపాలనా పరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.తద్వారా ఆక్రమణలకు చెక్ పెట్టొచ్చని ఆయన సూచించారు. దానికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల కాలువల పక్కన ఉన్న భూముల్లో ,ప్రాజెక్టులకు చెందిన భూములలో సౌర విద్యుత్ ప్లాంట్ ల ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇదే విషయమై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నీటిపారుదల శాఖా భూములలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై చర్చించామన్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు విద్యుత్ నందించ వచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.