- ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమైన రైతు కమిషన్.
- చెరువులు, కుంటల పరిరక్షణ, గ్రౌండ్ వాటర్ పెంపుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించిన కమిషన్.
- రైతు కమిషన్ ఆధ్వర్యంలో త్వరలో సమావేశం ఏర్పాటు.. సమావేశానికి హాజరుకావాలని మంత్రిని కోరిన కమిషన్
రాష్ట్ర సచివాయలంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ భేటీ అయ్యింది. ఈ భేటీలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి వున్నారు. ఇప్పటి వరకు రైతు కమిషన్ చేసిన కార్యక్రమాలను వివరించడంతో పాటు రాష్ట్రంలో చెరువులు, కుంటల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై మంత్రికి కమిషన్ సూచనలు చేసింది. మైనర్ ఇరిగేషన్ కింద ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణకు వెంటనే నీటి నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలనీ చెప్పింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా నీటి సంఘాలు వున్న అంశాన్ని గుర్తుచేసింది. గ్రామీణ స్థాయిలో రైతులు సంఘటితమై చెరువులను కాపాడుకునే వారని, ఐతే గత పదేండ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్న చెరువులు కుంటలు అన్యాక్రాంతమయ్యాయని వివరించింది. కొన్ని చోట్ల కబ్జాదారులు ఆక్రమించి లే ఔట్లు వేయడం, వాటర్ బాడీస్ కు వచ్చే క్యాచ్ మెంట్ ఏరియాల్లో భారీగా కాల్వలు దెబ్బతినడం, మాయమవడం జరిగాయని వివరించింది. ఐతే ప్రధానంగా చెరువులు కుచించుకపోవడం, గ్రౌండ్ వాటర్ లెవల్స్ పడిపోవడం జరిగిందని వివరించింది. రాష్ట్రంలో చెరువులు కాపాడుకుపడానికి సమగ్రమైన పాలసీ ఉండాలని రైతు కమిషన్ తెలిపింది. ఆ పాలసీని కమిషన్ తయారు చేయనున్నట్లు వివరించింది. నిపుణులతో పాలసీ కి సంబంధించి ప్రసెంటేషన్ మీటింగ్ త్వరలో కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు.. ఆ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకావాలని కమిషన్ కోరింది. కమిషన్ ఆహ్వానం కు మంత్రి ఉత్తమ్ సానుకూలంగా స్పందించినట్లు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.