- గతేడాది 188 మంది డోనర్ల నుంచి అవయవాల సేకరణ
- 725 మందికి అవయవమార్పిడి
- జీవన్దాన్కు అవార్డు అందజేసిన ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా
- హర్షం వ్యక్తం చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
అవయవదానంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2024లో ప్రతి పది లక్షల జనాభాకు దేశంలో సగటున 0.8 ఆర్గాన్ డొనేషన్స్ జరిగితే, తెలంగాణలో ప్రతి పది లక్షల జనాభాకు 4.88 డొనేషన్స్ జరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అవయవదానంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకుగానూ రాష్ట్రానికి నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యు ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (NOTTO) అవార్డు ప్రకటించింది. శనివారం, ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవదాన దినోత్సవ వేడుకల కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా జీవన్దాన్ ప్రతినిధులకు ఈ అవార్డును అందజేశారు. అవయవదానంలో తెలంగాణ టాపర్గా నిలవడం పట్ల రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. అవయవాలు పాడైపోయిన వ్యక్తుల ప్రాణాలు కాపాడే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో 2012లో జీవన్దాన్ ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. పేద, ధనిక బేధం లేకుండా అవసరమైన వారందరికీ అవయవాలు అందేలా ఇటీవలే తోట యాక్ట్ను అడాప్ట్ చేసుకున్నామని మంత్రి తెలిపారు. బ్రెయిన్ డెత్ కేసులలో అవయవాలు వృథా పోకుండా, దానం చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అవయవమార్పిడి చికిత్సను అందిస్తున్నామన్నారు. 2024లో 188 మంది బ్రెయిన్ డెత్ డోనర్ల నుంచి, 725 అవయవాలను ఇతరులకు అమర్చి, వారి ప్రాణాలు కాపాడగలిగామని మంత్రి వెల్లడించారు.
