వర్షాకాలం పూర్తయ్యే వరకూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

వర్షాకాలం పూర్తి అయ్యే వరకూ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించాలని రాష్ట్ర రవాణా శాఖ, జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు లోపల వర్షా కాలంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు ,సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ , మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తో కలిసి జిహెచ్ఎంసి, హైడ్రా, జలమండలి, ట్రాఫిక్ , విద్యుత్ , ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వర్షాకాలంలో క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను దూరం చేసేందుకు చేపట్టిన మాన్సూన్ సంబంధిత పనులు, రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైన్ వర్క్స్, డీ – సీలింగ్, రోడ్డు సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా చేపట్టిన రోడ్డు మరమ్మత్తు, క్యాచ్ పిట్ పనులు, హైడ్రా సమన్వయంతో చేస్పడుతున్న పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ మంత్రికి వివరించారు. సివరేజ్, స్టార్మ్ వాటర్ కలిసే ప్రదేశాలను గుర్తించి వాటిని వేరు చేసే ఓవర్ ఫ్లో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంత్రి కి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం లో అధికారులకు పలు సూచనలు చేశారు .

హైదరాబాద్ సహా ఓ ఆర్ ఆర్ లోపల ప్రజలకు ఇబ్బందులు దూరం చేసేందుకు
జిహెచ్ఎంసి, హైడ్రా, జలమండలి, ట్రాఫిక్ , విద్యుత్ , ఇరిగేషన్, రెవెన్యూ , లేక్స్ విభాగం అధికారులు,సిబ్బంది మరింత సమన్వయం , మరింత ప్రభావంతంగా పనిచేయాలన్నారు.
వర్షకాలంలో వేగంగా సమస్యల పరిష్కారానికి లైజనింగ్ ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఆ ప్రధాన బాధ్యత జిహెచ్ఎంసి తీసుకోవాలన్నారు. వర్షకాలంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సెలవులు రద్దు చేయాలన్నారు.

సంక్షోభ, సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సమర్థత చూపుతూ వాటిని పరిష్కరించేందుకు ఉమ్మడిగా, కలసికట్టుగా కదలాలని చెప్పారు. వర్షాకాలం పూర్తి అయ్యే వరకూ తాను 24 • 7 అందుబాటులో ఉంటానని అన్నారు. పభుత్వ పరంగా ఏమైనా జోక్యం అవసరం ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందిస్తానని మంత్రి తెలిపారు. C&D ( Construction and Demolition  ) వ్యర్థాలను లేక్ లు, చెరువులు, నాలా లలో వేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి జిహెచ్ఎంసి అధికారులకు సూచించారు.

వర్షపు నీటి సంరక్షణ సామాజిక బాధ్యత
వర్షపునీటి సంరక్షణ సామాజిక బాధ్యత అని మంత్రి తెలిపారు. నగరంలో వాటర్ మేనేజ్మెంట్ కు జిహెచ్ఎంసి, హైడ్రా, జలమండలి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టి భూమిలోకి ఇంకేలా చూడాల్సిన బాధ్యత అధికారుల పైనే కాకుండా, ప్రజల పైన కూడా ఉందన్నారు. నగర ప్రజలను ఆ దిశగా చైతన్యం చేయాలన్నారు. వినని వారిని సామదాన దండోపాయాలను ఉపయోగించి ఇంకుడు గుంతలు, ఇతర మార్గాలను ఉపయోగించి వర్షపునీటి సంరక్షణ చేసేలా చూడాలన్నారు. అనంతరం మంత్రి అన్ని విభాగాల అధికారులతో కలిసి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల నగర ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి ఇప్పటికే విస్పష్ట ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ప్రభుత్వ ముందుచూపుతోనే నగరంలో ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లలేదన్నారు. ప్రజలకు ఇబ్బంది వస్తే తమ దగ్గర ఉన్న ఏ వ్యవస్థ కైనా తమ సమస్యలను చెబితే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప సమయంలో అధిక వర్షాల వల్ల వరద ఓవర్ ఫ్లో అవుతుందని, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. దశాబ్దాలుగా ఉన్న ట్రాఫిక్ జామ్ సమస్యలతో పాటూ… వరద ముంపుకు శాశ్వత పరిష్కారం కోసం మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తుందని అన్నారు. సమావేశంలో హైడ్రా కమిషనర్ ఎ వి రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్,జోనల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు.