రాజగోపాల్‌రెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది: టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలించాల్సిందిగా క్రమశిక్షణ కమిటీకి సిఫారసు చేసినట్లు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపైౖ పరిశీలించమని క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవికి చెప్పామన్నారు. మంత్రి పదవి, ఇతర విషయాలపై ఎందుకు, ఎవరిని ఉద్దేశించి ఆ వాఖ్యలు చేశారో తెలుసుకుంటామని చెప్పారు. ఇక మార్వాడీలు గో బ్యాక్‌ అంటూ ఇటీవల వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. మార్వాడీలు మనలో ఒకరని, వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. మరోవైపు త్వరలో సీఎం రేవంత్‌రెడ్డితో అసంఘటిత కార్మికుల సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన అఖిల భారత అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల సమావేశంలో మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు కేకేసీ నేషనల్‌ ఛైర్మన్‌ ఉదిత్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.