- ప్రజలకు మెరుగైన సేవలందేలా చూడాలి
హైదరాబాద్: టీ ఫైబర్ పనులు జరిగిన తీరు… ప్రస్తుత పరిస్థితి… భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీ ఫైబర్ పై తన నివాసంలో సోమవారం రాత్రి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. టీ ఫైబర్ పనులు చేసిన కాంట్రాక్ట్ సంస్థలకు నోటీసులు ఇచ్చి పనులు చేసిన తీరుపై నివేదిక కోరాలని సీఎం ఆదేశించారు. సంస్థలో ఉద్యోగుల సంఖ్య, వారి పని తీరును సమీక్షించాలన్నారు. ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమమైనందున పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. టీ ఫైబర్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రణాళిక ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ఇప్పటి వరకు చేసిన వ్యయం, పూర్తి కావడానికి అవసరమయ్యే నిధులు, వాటి సేకరణ, కార్యక్రమం విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో పొందుపర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సమీక్షలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఐటీ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్, డిప్యూటీ కార్యదర్శి భవేష్ మిశ్రా, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.