మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • వివిధ నిర్మాణ దశల్లో 2 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు
  • రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: పేదలకు ఇళ్ల నిర్మించడంలో గత పదేళ్ల కాలంలో ఆనాటి పాలకులు మాటలకే పరి మితమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం చేతలతో చేసి చూపిస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల ఇందిరమ్మ ఇండ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ ను, ఆధునీకరించిన కార్యాలయ ఛాంబర్లను బుధవారం నాడు మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని విజయవంతం చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. పేదవాడి ఆలోచనలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు అవుతున్నదన్నారు. గతంలో హౌసింగ్ కార్పొరేషన్ ను దాదాపు మూసి వేసే స్థాయికి తీసుకెళ్లితే, ప్రజా ప్రభుత్వం దానికి పునర్జీవం కల్పిస్తున్నదని అన్నారు. అందుకనే ఆ కార్పొరేషన్ లో పనిచేసే సిబ్బందికి కూడా మంచి వసతులను కల్పిస్తూ ఇంకా పటిష్టం చేస్తామన్నారు. కార్పొరేషన్ సిబ్బంది ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి లక్ష్యసాధనకు తోడ్పాటును అందించాలని కోరారు. గ్రామాల్లో అర్హులైన పేదలందరికీ విడతల వారీగా ఇళ్లు వస్తాయన్న భరోసా కల్పించగలిగామని, ఇది చేతల ప్రభుత్వమని, ఇప్పటికే గ్రామాల్లో కొనసాగుతున్న పనులే నిదర్శనమని అన్నారు.

ప్రతికూల ఆర్ధిక పరిస్థితులున్నప్పటికీ ప్రతి సోమవారం లబ్ధిదారులకు చెల్లింపులు జరిగేలా చూస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే విధానాన్ని కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ వి.పి గౌతం ప్రసంగిస్తూ కార్పొరేషన్ ను పూర్తి స్థాయిలో పునరుద్దరించే చర్యల్లో భాగంగా, జిల్లాల్లో ఎఇ ల నియామకంతో పాటు, అవసరమైన మేరకు ఇతర విభాగాల అధికారుల సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని మంత్రిగారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం తోపాటు హౌసింగ్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.