వైద్యవ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఒక్కప్పుడు అంటువ్యాధుల సమస్య ఎక్కువగా ఉండేదని.. ఇప్పుడు జీవనశైలి వ్యాధుల సమస్య ఎక్కువైందని.. ఇందుకు అనుగుణంగా వైద్య వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో కొత్త డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో శనివారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కిడ్నీ జబ్బులు, డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. 2009లో డయాలసిస్ సేవలు ప్రారంభించినప్పుడు 1230 మంది డయాలసిస్ పేషెంట్లు, ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 12 వేలు దాటిందని తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు.

ఈ అంశంపై మంత్రి మాట్లాడుతూ.. కిడ్నీ, కేన్సర్ జబ్బులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ఒకప్పుడు అంటువ్యాధుల సమస్య ఉండేదని, ఆ వ్యాధుల నియంత్రణకు అనుగుణంగానే మన వైద్య రంగం తయారు చేయబడిందన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైందని, అంటువ్యాధులు తగ్గిపోయి, నాన్ కమ్యినికేబుల్ డిసీజ్‌లు పెరిగిపోయాయన్నారు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన సెడెంటరీ లైఫ్ స్టైల్ వంటి అనేక కారణాల వల్ల కుగ్రామంలో కూడా బీపీ, షుగర్, కిడ్నీ, గుండె జబ్బులు, కేన్సర్లు పెరుగుతున్నాయన్నారు. ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా వైద్య వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై స్టడీ చేయాలని, ఇతర దేశాల్లో అవలంభిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. నాన్ కమ్యునికెబుల్ డిసీజ్‌ల నివారణ, నియంత్రణ, చికిత్స అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయాలన్నారు. నాన్ కమ్యునికెబుల్ డిసీజ్‌లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ఆరోగ్యకరమైన జీవన విధానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. బీపీ, షుగర్లు వస్తే పోయేవి కాదు అని, కిడ్నీ జబ్బులు, కేన్సర్ల చికిత్స ఒక్కరోజుతోనే~ ఒక నెలతోనే పూర్తవ్వదన్నారు. ఆయా జబ్బుల బారిన పడిన ప్రజలకు చికిత్స అందించేందుకు అనుగుణంగా మన హాస్పిటల్స్ తయారు కావాలన్నారు. అందులో భాగంగానే ఎన్‌సీడీ క్లినిక్‌లు, కేన్సర్ డే కేర్ సెంటర్లు పెట్టుకున్నామని గుర్తు చేశారు.

డయాలసిస్ పేషెంట్లు మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారని, వారికి పెన్షన్ అందించి కొంత వరకూ ఆర్థికంగా బాసటగా నిలుస్తున్నామన్నారు. కానీ, అది మాత్రమే సరిపోదన్నారు. ప్రతి గ్రామం, ప్రతి పట్టణానికి సమీపంలోనే అవసరమైన అన్నిరకాల వైద్య సేవలు ఉచితంగా డయాలసిస్ పేషెంట్లకు అందాలన్నారు. డయాలసిస్ కోసం పదుల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి, గంటల తరబడి ఎదురు‌ చూడాల్సిన దుస్థితి ఉండకూడదన్నారు. పేషెంట్లతో పాటు ప్రయాణించి, పేషెంట్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండొద్దన్నారు. పేషెంట్ ఒక్కరే వెళ్లి గంటల వ్యవధిలోనే తిరిగి ఇంటికి చేరుకునేలా, ప్రతి 20 లేదా 25 కిలోమీటర్లకు ఓ డయాలసిస్ సెంటర్ ఉండాలన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్దం‌ చేయాలని హెల్త్ సెక్రటరీని మంత్రి ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో డిస్టెన్స్‌తో పాటు, పేషెంట్ల సంఖ్య, జనాభాను కూడా పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే, ఇప్పటికే ఉన్న సెంటర్లలో అవసరమైనచోట మిషన్ల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వీటితో కలిపి ప్రస్తుతం102 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్లలో సుమారు 7550 మంది పేషెంట్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ హాస్పిటళ్లలో సుమారు మరో 5060 మందికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని అధికారులు మంత్రికి తెలిపారు.