తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్

తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీ ఏరియాను ప్రజల మౌలిక వసతులకు నిలువుటద్దం పట్టే గ్లోబల్ సిటీకి చిరునామాగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. మానవ జీవన ప్రమాణాలకు కొలమానమైన విద్య, వైద్యం, రోడ్డు రవాణా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సీఎం అన్ని విభాగాల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. సిటీ విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి ప్రజలు గ్రేటర్ సిటీకి లక్షలాది కుటుంబాలు వలస వస్తున్నాయని అన్నారు. సిటీ పరిధితో పాటు పెరుగుతున్న జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అధునాతనంగా అందించే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధిపై ప్రతిపాదనలపై చర్చించారు. సీఎంతో పాటు సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సిఎం సెక్రటరీ మాణిక్రాజ్, జిహెచ్ఎంసీ, హైడ్రా, హెచ్ఎండీఏ కమిషనర్లు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కోర్ అర్బన్ సిటీ అభివృద్ధి ప్రణాళికను అయిదు ప్రధాన అంశాలుగా విభజించి, మొత్తం 111 ప్రతిపాదనలను స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్తో వివరించారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే ప్రతిపాదనలను మరింత లోతుగా పరిశీలించాలని, ప్రజల అవసరాలు తీర్చే మౌలిక వసతులను ప్రపంచ స్థాయి అధునాతన ప్రమాణాలతో అందించేందుకు పెద్దపీట వేయాలని సీఎం అన్నారు. పైపై మెరుగులు కాకుండా పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా తెలంగాణ కోర్ అర్బన్ సిటీని అభివృద్ధి చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.

కోర్ అర్బన్ సిటీ అభివృద్ధిలో భాగంగా ప్రాథమిక విద్యను అందరికీ అందించే సంస్కరణలు ముందుగా అమలు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉన్న ప్రభుత్వ ప్ర్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కాలేజీలన్నింటినీ గుర్తించాలన్నారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు, 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు మూడు కేటగిరీలుగా నాణ్యమైన విద్యను అందరికీ అందించాలన్నారు. నర్సరీ నుంచి 4వ తరగతి స్కూళ్లపై ముందుగా ఫోకస్ చేయాలని, ప్రభుత్వ స్థలాలు, ఇటీవల కబ్జాలు, ఆక్రమణల నుంచి విముక్తి పొందిన ప్రభుత్వ భూముల్లో స్కూళ్లకు అధునాతన భవనాలు నిర్మించాలన్నారు. ఇప్పుడు అరకొర వసతులతో ఉన్న నాలుగైదు స్కూళ్లను ఒకే సముదాయంలోకి తీసుకువస్తే మంచి ఫలితాలుంటాయన్నారు. టీచర్ల కొరత తీరిపోతుందన్నారు. పిల్లలకు బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ కూడా స్కూల్లోనే అందించి, ప్రభుత్వం తరఫున ట్రాన్సోపోర్ట్ అందించాలన్నారు. దీంతో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులపై ఫీజుల భారం తగ్గుతుందని, ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్య పిల్లల భవితకు దోహదపడుతుందన్నారు. వెంటనే ఈ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలని విద్యాశాఖను సీఎం ఆదేశించారు. ఇదే విధంగా పేదలందరికీ తక్షణ వైద్య సాయం అందుబాటులో ఉండేలా ప్రత్యేక క్లినిక్లు ఏర్పాటు చేయాలన్నారు.

ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సీఎం అధికారులను హెచ్చరించారు. ప్రపంచంలో హైదరాబాద్కు క్లీన్ సిటీ ఇమేజీ తీసుకువచ్చేందుకు నిరంతరం శ్రమించాలన్నారు. చెత్త సేకరణలో నిర్ల్యక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మున్సిపల్, జీహెచ్ఎంసీ అధికారులను హెచ్చరించారు. చెత్త సేకరణతో పాటు క్లీన్ సిటీగా రూపొందించే ప్రణాళికలను అమలు చేసే అధికారులకు ప్రభుత్వం తరఫున ప్రోత్సహకం ఉంటుందని సీఎం ప్రకటించారు. కోర్ అర్బన్ సిటీలో ఒక్క ప్రభుత్వ ఆఫీస్ కూడా అద్దె భవనాల్లో ఉండేందుకు వీల్లేదని, ప్రతి ఆఫీస్కు సొంత భవనం ఉండాలని సీఎం అన్నారు. వాటికి అవసరమైన స్థలాలు కేటాయించాలని, ప్రాధాన్య క్రమంలో భవనాలు నిర్మించే ప్రణాళిక తయారు చేయాలన్నారు. సెక్రెటేరియట్తో పాటు సిటీలో ఉన్న ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలన్నీ పునరాత్పదక విద్యుత్తున మాత్రమే వినియోగించాలని సీఎం చెప్పారు. వెంటనే ఆఫీసులపై సోలార్ విద్యుత్తు ప్లాంట్లు అమర్చాలని ఆదేశించారు. కోర్ అర్బన్ సిటీలో నాలాలు, కుంటలు, చెర్వుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సీఎం ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు డిజిటల్ ల్యాండ్ డేటాబేస్ విధానం అమలు చేయాలన్నారు.

సిటీలో గంటల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ స్టడీ జరగాలని, ట్రాఫిక్ నియంత్రణ సమర్థంగా జరిగేందుకు అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సిటిలో ఉన్న అన్ని జంక్షన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలని చెప్పారు. గూగుల్ సహకారంతో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించే ప్రణాళిక వెంటనే అమలు చేయాలని సీఎం పోలీసు విభాగాన్ని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్ విధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు. వెంటనే డ్రోన్లను కొనుగోలు చేయాలన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీటిని వినియోగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని చెప్పారు. సిటీలో వర్షం పడితే ట్రాఫిక్ గంటల కొద్దీ ఆగిపోతుందని, జంక్షన్లలో నీళ్లు నిల్వకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ను నిర్మించాలని చెప్పారు. కోర్ అర్బన్ సిటీలో మున్సిపల్, పోలీస్, విద్యుత్తు, జలమండలి విభాగాల యూనిట్లు, వాటిని పర్యవేక్షించే అధికారుల పరిధి ఒకేతీరుగా ఉండాలని సీఎం సూచించారు. ఉదాహరణకు మున్సిపల్ జోన్ ఏరియా, అక్కడి పోలీస్ స్టేషన్ ఏరియా, జలమండలి, విద్యుత్తు సర్కిల్ పరిధికి ఒకే హద్దులుంటే అక్కడుండే అధికారుల పర్యవేక్షణ, సమన్వయం సమర్థవంతంగా ఉంటుందన్నారు. అందుకు వీలుగా అన్ని విభాగాలు ఏరియాను, అధికారుల హోదాలను పునర్వవస్థీకరించాలని సీఎం ఆదేశించారు. సిటీలో డ్రైనేజీ, మ్యాన్ హోల్స్ క్లీనింగ్కు రోబోట్ లను వాడాలని, యంత్ర పరికరాలతోనే క్లీనింగ్ జరగాలని సీఎం ఆదేశించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానం తరహాలో మూసీ పరివాహకంలో ఉన్న అంబర్పేట స్మశాన వాటికను అధునాతనంగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు.

హుస్సేన్ సాగర్ చుట్టూ నెక్లెస్ రోడ్, ఇందిరా పార్క్, సంజీవయ్య పార్కు ఏరియాను అద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా హుస్సేన్ సాగర్ 2.0ను అన్ని హంగులతో అభివృద్ధి చేయాలన్నారు. స్కై వాక్, సైకిల్ ట్రాక్తో పాటు మల్టీ లెవల్ పార్కింగ్ తో పాటు పర్యాటకులను ఆకట్టుకునే నిర్మాణాలు చేపట్టాలన్నారు. కోర్ అర్బన్ సిటీలో ఉన్న పార్కులన్నింటినీ పిల్లలను ఆకట్టుకునేలా, వారికి ఆహ్లాదంగా ఉండేలా అభివృద్ధి చేయాలని సీఎం అన్నారు. ఇప్పుడున్న పార్కులన్నీ సీనియర్ సిటిజన్లకు, వాకర్లకు పనికొచ్చేవిగా మారిపోయాయని అన్నారు. అన్ని పార్కుల్లో చిల్డ్రన్ జోన్ తో పాటు పిల్లల ఆటపాటలకు వీలుగా ఆకట్టుకునే ప్లే జోన్లను అభివృద్ధి చేయాలన్నారు.

వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్స్ ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, ఫైర్ సేఫ్టీ అంశాలపై అత్యంత పకడ్బందీ వ్యవస్థ ఉండాలని సీఎం పలు సూచనలు చేశారు. వీధి దీపాలకు సోలార్ విద్యుత్ వినియోగం, కొత్తగా పునరుద్ధరిస్తున్న చెరువుల వద్ద పైలట్ ప్రాజెక్టుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు అంశాన్ని పటిశీలించాలన్న సీఎం. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సిటీలో ఉన్న అన్ని విద్యుత్ సబ్ స్టేషన్ల అప్ గ్రేడేషన్ తో పాటు, ఎక్కడపడితే అక్కడ ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను స్ట్రీమ్ లైన్ చేసి రీ-లొకేట్ చేయాలని సూచించారు. మంచినీటి, మురుగునీటి వ్యవస్థపై నిర్వహణ వేర్వేరుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అనుమతుల విషయంలో వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలన్నారు. డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని సీఎం ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి సేవించి పట్టుబడితే బాధితులగా చూడవద్దని, కనీసం పది రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచాలని సీఎం అన్నారు. చెర్లపల్లి జైలు ప్రాంగణంలోనే ఈ రీహాబిలిటేషన్ సెంటర్ నిర్మించాలని అన్నారు. ఈ సెంటర్ నిర్వహణ, పర్యవేక్షణకు ఎక్స్ మిలిటరీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.