పీఎం జన్‌మన్‌లో తెలంగాణకు మూడో ర్యాంకు

  • అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌లో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ ప్రతిభ కనబర్చి.. అవార్డులు సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సెక్రెటరీ కోఆర్డినేషన్ డా. గౌరవ్ ఉప్పల్ అవార్డులను స్వీకరించారు. అక్టోబర్ 17న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆది కర్మయోగి జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జన్‌మన్, ఆది కర్మయోగి అభియాన్ కింద ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామ స్థాయి అధికారులను రాష్ట్రపతి సత్కరించారు.

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ జాతీయ స్థాయి సన్మాన కార్యక్రమం జరిగింది. గిరిజన సాధికారత కార్యక్రమాలు – PM-JANMAN, ఆది కర్మయోగి అభియాన్, జనభాగిరధి, ధర్తి ఆబా జన్ భగీదరి అభియాన్ కింద ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మంత్రిత్వ శాఖలు, అధికారులకు భారత రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చేశారు.

ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌లో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరిచింది. జాతీయ ర్యాంకింగ్‌లో 3వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా గిరిజన సమూహాలకు న్యాయం చేయడం, వారు నివసించే ప్రాంతాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేసి.. మూడో స్థానంలో నిలిచింది. అలాగే.. తెలంగాణలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ పద్మ పి.విని సూపర్ కోచ్‌లు/రాష్ట్ర మాస్టర్ ట్రైనర్‌లలో ఒకరిగా సత్కరించారు.

బెస్ట్ పెర్ఫార్మర్స్ స్క్రీన్ డిస్‌ప్లే..
1.ఆదికర్మయోగి అభియాన్ – ఆదిలాబాద్, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం
2.ఉత్తమ ప్రదర్శన సూపర్ కోచ్/రాష్ట్ర మాస్టర్ ట్రైనర్ – డాక్టర్ కీర్తి
3.ధార్తీ అభా జనభాగిదారి అభియాన్ – ఆదిలాబాద్, ఆసిఫాబాద్

ఈ కార్యక్రమంలో డా.గౌరవ్ ఉప్పల్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్‌ జిల్లాల కలెక్టర్లు జితేష్ వి పాటిల్, వెంకటేశ్ ధోత్రే లు, ఆదిలాబాద్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మత్, ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా, ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సముజ్వల పాల్గొన్నారు.