హైదరాబాద్‌ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం లోగోను ఆవిష్కరించిన గవర్నర్‌

హైదరాబాద్‌ : ఈ సంవత్సరం డిశంబరు 19 వ తేదీ నుండి 21వ తేదీ వరకూ ప్రసాద్‌ ఐమాక్స్‌లో జరగనున్న తొలి హైదరాబాద్‌ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం లోగోను తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ శ్రీ జిష్ణుదేవ్‌ వర్మ సోమవారం నాడు గవర్నర్‌ దర్బార్‌ హాలులో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం ఛీఫ్‌ పాట్రన్‌ జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ దర్శకులు సి ఉమా మహేశ్వరరావు, లఘు చిత్రోత్సవ నిర్వాహకులు దాదా సాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిలిం స్టడీస్‌ ప్రిన్సిపల్‌ నందన్‌ బాబు, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కార్యనిర్వహక అధికారి ప్రియాంకలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ లఘుచిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశవ్యాప్తంగా పలు చలనచిత్రోత్సవాలు జరుగుతున్నా ఈ స్థాయిలో అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం నిర్వహించబూనుకోవటం పట్ల గవర్నర్‌ నిర్వాహకులను అభినందించారు. హైదరాబాద్‌ సంస్కృతీ సాంప్రదాయాలకు ఈ లోగో దర్పణం పడుతోందని ఆయన ప్రశంసించారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో హైదరాబాద్‌కు విశేషమైన స్తానం ఉందని, ఈ లఘుచిత్రోత్సవాల ద్వారా నగరం కొత్తదనాన్ని సంతరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించిన ప్రాధమిక అవగాహన కల్పించేందుకు లఘుచిత్రాలు కీలకమైన సాధనంగా మారాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ దేశంలో ఈ స్థాయిలో లఘుచిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేకంగా మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించటం ఇదే మొదటిసారని, రానున్న కాలంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ చలనచిత్ర యవనికలో ఓ ప్రాధాన్యత కలిగిన కేంద్రంగా అభివృద్ధి చేయటానికి ఈ లఘుచిత్రోత్సవాలు ఉపయోగపడతాయని అన్నారు. రానున్న కాలంలో భారదేశంలోనే హైదరాబాద్‌ను చలనచిత్ర హబ్‌గా అభివృద్ధి చేసేందుకు చలన చిత్ర అభివృద్ధి సంస్థ నిర్విరామంగా కృషి చేస్తోందని, దేశంలోనే అత్యధిక సంఖ్యలో పిలిం స్రీన్‌లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఆమె అన్నారు. ఈ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవాల నిర్వహణలో తెలంగాణ చిలన చిత్ర అభివృద్ధి సంస్థ ప్రధాన భాగస్వామిగా ఉండటం ఎంతో సంతోషించదగ్గ విషయమని, ఈ ఉత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. లఘుచిత్రోత్సవం ఛీఫ్‌ పాట్రెన్‌ సి ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ, డిశంబరు 19 నుండీ 21 మధ్య నిర్వహించబోతున్న ఈ లఘు చిత్రోత్సవాలు ఆధునిక ప్రపంచ సంస్కృతితో తెలంగాణ సంస్కృతి పెనవేసుకోవడానికి ఓ వేదికగా ఉంటుందనీ, తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా సాంస్కృతిక ఉత్పత్తులు, లఘుచిత్రాలు నిర్మించే యువతకు ఈ ఉత్సవాలు అద్భుతమైన అవకాశాలను కల్పించనున్నాయని, ఈ సందర్భంగా సినీ రంగ నిపుణులతో జరిగే ప్యానెల్‌ చర్చల్లో చలన చిత్ర కౌశలానికి సంబంధించిన ఎన్నో విషయాలు చర్చించనున్నట్లు ఉమా మహాశ్వరరావు తెలిపారు.