- రీసెర్చ్, బ్రేక్త్రూ ఐడియాలకు ప్లాట్ఫామ్గా “గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్”
- “డాయిష్ బోర్స్ గ్రూప్” జీసీసీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ ను గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ(ఫిన్ టెక్)కి అత్యంత కీలకమైన గ్లోబల్ కమాండ్ సెంటర్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం రాయదుర్గంలో అంతర్జాతీయ దిగ్గజ ఫైనాన్షియల్ మార్కెట్ సంస్థ “డాయిష్ బోర్స్ గ్రూప్” గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(జీసీసీ)ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పిల్లర్గా ఉన్న డాయిష్ బోర్స్ గ్రూప్ హైదరాబాద్ను ఎంచుకోవడం రాష్ట్ర ప్రభుత్వ పటిష్ఠమైన పాలసీలు, స్థిరత్వం, ఇక్కడి టాలెంట్ పూల్పై గ్లోబల్ కంపెనీలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ప్రపంచంలోని టాప్ టెన్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థలలో ఏడు ఇక్కడ నిర్వహిస్తుండటం మనకు గర్వకారణమన్నారు. డాయిష్ బోర్స్ రాకతో హైదరాబాద్ గ్లోబల్ క్యాపిటల్, సంపదకు శక్తినిచ్చే కేంద్రంగా అంతర్జాతీయ యవనికపై మరోసారి నిరూపించుకుందన్నారు. నగరాన్ని కేవలం ఇంక్యుబేషన్ హబ్గా మాత్రమే కాకుండా “గ్లోబల్ ఆవిష్కరణ పవర్హౌస్”గా మార్చేలా ఒక ప్రత్యేక గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించబోతున్నట్లుగా వెల్లడించారు. ఈ హబ్ రీసెర్చ్, బ్రేక్త్రూ ఐడియాలకు ప్లాట్ఫామ్గా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పెట్టుబడులను ఆకర్షించడంపైనే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చే వాల్యూను సృష్టించేందుకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ జీసీసీ షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రధాన ఎక్స్ఛేంజీలతో సహా 24 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆస్తులను నిర్వహించే గ్లోబల్ మార్కెట్లకు అత్యున్నత సేవలు అందిస్తుందన్నారు. తొలిదశలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇంజనీరింగ్ వంటి డీప్ టెక్నాలజీ రంగాల్లో 1,000 మందికి హై స్కిల్డ్ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య రెండింతలు అవుతుందన్నారు. కార్యక్రమంలో జర్మనీఅంటూ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్, స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, డ్యుయిష్ బోర్స్ సీఐవో/ సీవోవో డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, డైరెక్టర్ డాక్టర్ లుడ్విగ్ హీన్సెల్మన్ తదితరులు పాల్గొన్నారు.