- తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ 2025 బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ క్రీడా ప్రోత్సాహక విధానాల వల్లనే పలు జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు హైదరాబాద్ వేదికగా మారుతోందని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ‘తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ 2025’ బ్యాడ్మింటన్ పోటీలను మంత్రి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహక విధానాన్ని అమలు చేస్తోంది. దాని ఫలితంగా హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడా టోర్నమెంట్లు నిర్వహించే ప్రణాళిక ఉంది” అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, “హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడకు హబ్ లాంటిదే. దేశానికి అనేక బ్యాడ్మింటన్ ఛాంపియన్లను అందించిన ఘనత తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి దక్కింది” అని అన్నారు.
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ విజయవంతంగా సాగేందుకు స్పోర్ట్స్ అథారిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, గత రెండేళ్లలో అనేక మెగా ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించిన ఘనత సంస్థకు దక్కిందని తెలిపారు. పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, “ఈ టోర్నమెంట్ నిర్వహణలో స్పోర్ట్స్ అథారిటీ అందిస్తున్న సహకారం ప్రశంసనీయం” అని అన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డా. సోని బాలాదేవి, డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, డా. రవితేజ, అనిత, సుజాత, పద్మావతి, స్పెషల్ ఆఫీసర్ భాష పి ఆర్. ఓ కాలేరు సురేష్ స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కన్నం మధు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు యువిఎన్ బాబు, వంశీధర్, లక్ష్మణ్, కె. శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.