- సీఎస్ఆర్ సమ్మిట్లో కార్పొరేట్ సంస్థలకు మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపు
హైదరాబాద్: పర్యాటకం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదని.. వారసత్వం, ప్రాచీన సంస్కృతిని మన ముందు ఆవిష్కరిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శిల్పకళావేదికలో సోమవారం నిర్వహించిన దక్షిణ భారత అతి పెద్ద సీఎస్ఆర్ సమ్మిట్ రెండో ఎడిషన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. Empowering Change, Building Tomorrow అనే అంశం ఈ సమ్మిట్కు సరైన ఆత్మగా నిలిచిందని పేర్కొన్నారు.
మంత్రి మాట్లాడుతూ ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు మన రాష్ట్రానికి వస్తున్నారు. మన సంప్రదాయాలు, పండుగలు, హస్తకళలు, వంటకాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయి. పర్యాటకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. స్థానిక కళాకారులు, నేయకారులు, చిన్న వ్యాపారులు ఉపాధి పొందుతున్నారు అని చెప్పారు. కార్పొరేట్ విజయాన్ని సామాజిక ప్రగతితో కలిపే వారధి సీఎస్ఆర్. వారసత్వ కట్టడాల సంరక్షణ, యువత నైపుణ్యాభివృద్ధి, సంప్రదాయ కళల ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో ఇది కీలకంగా నిలుస్తుంది అని వివరించారు. అన్ని సంస్థలు ఒక్కో పర్యాటక ప్రదేశాన్ని దత్తత తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇది కేవలం ఆర్థిక సహకారం కాదు. బాధ్యతతో కూడిన భాగస్వామ్యం. ప్రభుత్వం కూడా దత్తత తీసుకున్న సంస్థలకు తగిన గుర్తింపు ఇస్తుంది అని చెప్పారు. ఈ సమ్మిట్లో 300కు పైగా కార్పొరేట్ సంస్థలు, 100 ఎన్జీఓలు పాల్గొనడం గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీ వినిల్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన అభినందించారు. అలాగే ‘బచ్పన్ బచావో’ సంస్థను కమ్యూనిటీ పార్ట్నర్గా ఎంపిక చేసినందుకు ప్రశంసించారు.
