స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి (నవంబర్ 14) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆ మహనీయుడిని స్మరించుకున్నారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ బాలల దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని బాల బాలికలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
బాలలను జాతి సంపదగా భావించి వారి మెరుగైన భవితవ్యానికి కృషి చేయాలన్న నెహ్రూ ఆకాంక్షల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులన్న నెహ్రూ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో మెరుగైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. చదువుతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.