సబ్‌స్టేషన్‌లోనే విద్యుత్‌శాఖ అధికారుల మందు సిట్టింగ్‌

విద్యుత్‌శాఖ అధికారులు ఏకంగా సబ్‌స్టేషన్‌లోనే మందు సిట్టింగ్‌ పెట్టారు. ఈ దావత్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో వారంతా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టౌన్‌-1 సబ్‌స్టేషన్‌ కార్యాలయం స్టాఫ్‌రూమ్‌లో శనివారం రాత్రి అసిస్టెంట్‌ లైన్‌మెన్లు ప్రభాకర్‌, బాలకృష్ణ, రాజశేఖర్‌ మద్యం తాగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియా లో వైరల్‌ కాగా విధినిర్వహణలో ఉండాల్సిన ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయంలోనే మద్యం సేవించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాథమిక విచారణలో మందు పార్టీ చేసుకున్నట్టు నిర్ధారణ కావడంతో ముగ్గురు అసిస్టెంట్‌ లైన్‌మెన్లను సస్పెండ్‌ చేస్తున్నట్టు జగిత్యాల డి విజినల్‌ ఇంజినీర్‌ గంగారాం పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి హెచ్‌ఆర్డీ విభాగం నుంచి అడ్వయిజరీ మెమో జారీ చేసినట్టు ఆయన తెలియజేశారు.