- ఆరోగ్యశాఖలో కొలువుల పండుగ
- పూర్తయిన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ
- 1284 మందికి ఉద్యోగాలు..
- సెలక్షన్ లిస్ట్ విడుదల చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
- డాక్టర్లు, సిబ్బందితో కలకలలాడుతున్న ప్రభుత్వ హాస్పిటళ్లు
- భర్తీ ప్రక్రియలో మరో 7 వేలకుపైగా పోస్టులు
డాక్టర్లు, వైద్య సిబ్బందితో ప్రభుత్వ హాస్పిటళ్లు కలకలలాడుతున్నాయని.. పేషెంట్లకు మెరుగైన సేవలు అందుతున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం ఆయన విడుదల చేశారు. ప్రభుత్వ హాస్పిటళ్లలోని 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి గతేడాది చివరిలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయగా, 24,045 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 23,323 మంది బోర్డు నిర్వహించిన పరీక్షకు (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) హాజరయ్యారు. వీరిలో పోస్టులకు ఎంపికైన వారి జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధం చేయగా, సెక్రటేరియట్లో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఇతర అధికారులతో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం ఆ జాబితాను విడుదల చేశారు. అనంతరం, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు, వారు సాధించిన మార్కుల వివరాలను బోర్డు వెబ్సైట్లో అధికారులు అప్లోడ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశామని, మరో 7 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ వంటి ముఖ్యమైన పోస్టులతో పాటు, వైద్య సేవలు మెరుగుపర్చేందుకు అవసరమైన ఇతర అన్నిరకాల పోస్టులనూ భర్తీ చేస్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి డాక్టర్లు, సిబ్బంది లేక వెలవెలబోయిన హాస్పిటళ్లు, ఇప్పుడు కలకలలాడుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. డాక్టర్లు, సిబ్బంది రాకతో ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. వీలైనంత త్వరలో మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని తెలిపారు.