- 230 పతకాలతో రాష్ట ప్రతిష్టను ప్రపంచానికి చాటిన గిరిజన గురుకుల విద్యార్థులు.
- విద్యార్థులను సన్మానించిన గిరిజన సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హైదరాబాద్: రౌర్కెలా–సుందర్గఢలో నవంబర్ 11 నుంచి 15 వరకు జరిగిన 4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్–2025లో తెలంగాణ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. దేశవ్యాప్తంగా ఉన్న EMRS పాఠశాలల మధ్య జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ Overall Championship, Overall Team Championship, Overall Individual Championshipను సొంతం చేసుకుని ఘనవిజయం సాధించింది. తెలంగాణలోని 23 EMRS సంస్థల నుండి 580 మంది విద్యార్థులు, 68 మంది ఎస్కార్ట్ టీచర్లు పాల్గొన్నారు. షూటింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, జూడో, స్విమ్మింగ్, తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, యోగా, బాస్కెట్బాల్, ఖో-ఖో తదితర విభాగాల్లో విశేష ప్రతిభను చాటి మొత్తం 230 పతకాలు సాధించి రాష్ట ఘనతను చాటారు. గెలుపొందిన క్రీడాకారులను సన్మానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఈ విజయం సాధించిన తెలంగాణ EMRS విద్యార్థులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం సచివాలయంలో తన ఛాంబర్ లో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ “రౌర్కెలాలో జరిగిన క్రీడా పోటీల్లో తెలంగాణ EMRS విద్యార్థులు సాధించిన 230 పతకాలు గిరిజన యువత ప్రతిభకు జాతీయస్థాయి గుర్తింపు” అని తెలిపారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న నూతన క్రీడా విధానం, EMRSలలో ప్రపంచ స్థాయి క్రీడా వాతావరణం సృష్టించడంలో ఒక గొప్ప పాత్ర పోషించిందని మంత్రిగారు చెప్పారు. అథ్లెటిక్స్, షూటింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, జూడో, యోగా, స్విమ్మింగ్ వంటి విభాగాల్లో విద్యార్థులు సాధించిన పతకాలు క్రమశిక్షణ, శ్రమ, పట్టుదలకు ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ EMRS వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమ క్రీడా సదుపాయాలు, నైపుణ్యం, శిక్షణ అందిస్తున్నదనే దానికి ఈ విజయం నిదర్శనమన్నారు. విద్యార్థుల విజయాల్లో కోచ్లు, టీచర్లు, అధికారులు, తల్లిదండ్రుల కృషి అమూల్యమని మంత్రి అభినందించారు. “ప్రతి EMRS విద్యార్థి రాష్ట్రనికి ఒక గర్వకారణం. ప్రభుత్వం అన్ని విధాలుగా క్రీడాకారులకు అండగా ఉంటుంది” అని హామీ ఇచ్చారు. ఈ విజయాలు భవిష్యత్తులో మరిన్ని జాతీయ–అంతర్జాతీయ పతకాలకు నాంది పలుకుతాయనీ, గిరిజన విద్యార్థుల క్రీడా ప్రతిభను సహకరిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TGTWREIS సెక్రటరీ శ్రీమతి కే. సీతాలక్ష్మి, IAS, EMRS అధికారులు, కోచ్లు, టీచర్లు పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు.
