రవాణా శాఖ లో ఎన్ ఫోర్స్ మెంట్ ను మరింత కఠినతరం చేయండి: మంత్రి పొన్నం ప్రభాకర్

  • రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఎన్ఫోర్స్మెంట్ కోసం కొత్తగా ఏర్పడిన 33 జిల్లా స్థాయి బృందాలు, 3 రాష్ట్ర స్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ నిరంతర తనిఖీలు చేపట్టాలి
  • వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్ లు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్ ఫోర్స్ మెంట్ చేయాలి
  • 10 రోజుల వ్యవధిలో కొత్తగా ఏర్పడిన బృందాల ద్వారా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 4748 కేసులు, 3420 వాహనాలు సీజ్
  • హెవీ వెహికిల్ డ్రైవర్స్ కి పునశ్చరణ ట్రైనింగ్ ఏర్పాటు చేయండి
  • మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ వాహనాల్లో ఓవర్ లోడ్ కాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలి
  • ఓవర్ లోడ్ చేసిన వాహనాల సీజ్, రెండవ సారి పట్టుబడితే పర్మిట్ రద్దు, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
  • జనవరి లో జరిగే రోడ్డు భద్రతా మాసం పై కార్యాచరణ రూపొందించండి..
  • రవాణా శాఖ ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కొద్ది రోజులుగా రవాణా శాఖ అమలు చేస్తున్న సంస్కరణలపై మరింత కఠిన తరం చేసేలా రవాణా శాఖ ఉన్నత స్థాయి అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించే విధంగా అధికారులు పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ వేగవంతం చేయడానికి ఇటీవల రవాణా శాఖలో 33 జిల్లా స్థాయి బృందాలు, మూడు రాష్ట్రస్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో డిటిసి, ఆర్టిఏ ఇతర అధికారులు నిరంతరం ఇందులో తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలు ఏ బృందం ఎక్కడ చేపడుతుంది అనేదానిపై ముందస్తు సమాచారం లేకుండా ప్రతి రోజు ఉదయం 6 గంటలకి ఆయా బృందాలకు సమాచారం అందించి తనిఖీలు చేపట్టింది. గత 10 రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన 4748 కేసులు నమోదు చేయబడ్డాయి. మొత్తం 3420 వాహనాలు సీజ్ చేయబడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత తనిఖీలు ముమ్మరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారుల ఆదేశించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ఓవర్ లోడ్ వల్లే అధికంగా జరుగుతుండడంతో దాని మీద ఎక్కువగా దృష్టి సారించారు. ఓవర్ లోడ్ అయిన వాహనాలు సీజ్ చేయడంతో పాటు, రెండోసారి ఓవర్ లోడ్ తో వాహనం పట్టుబడితే ఆ వాహనం పర్మిట్ రద్దు చేయడంతో పాటు, వాహనం నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకోనున్నారు . అయితే ఓవర్ లోడ్ పై మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే వాహనాల లోడింగ్ జరుగుతుందో అక్కడే నివారించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

హెవీ వెహికల్ డ్రైవర్ కి లైసెన్సు రెన్యువల్ సమయంలో పునఃశ్చరణ తరగతులు ఏర్పాటు చేసేలా కార్యాచరణ తీసుకోవాలని సూచించారు. రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తున్న సమాచారాన్ని ప్రజల నుండి సమాచారం వచ్చిన రవాణా శాఖ అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. గత సంవత్సరం నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవం మంచి ఫలితాలు ఇచ్చిందని ఈ సారి జనవరిలో జరిగే రోడ్డు భద్రత మాసోత్సవాలపై ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో విద్యార్థులు, డ్రైవర్లు, కార్మికులు, పోలీసులు, అధికారులు భాగస్వామ్యం ఉండేలా ఇప్పటి నుండి అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాల నుండి కాలేజీ వరకు వ్యాసరచన పోటీలు, రోడ్డు నిబంధన పై నాటకాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండేలా చేసి ప్రమాదాలు తగ్గించి మరణాల రేటు నివారించేలా కార్యాచరణ తీసుకోవాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. రవాణా శాఖలో పెండింగ్ లో ఉన్న ఖాళీల భర్తీ చేయడంతో పాటు , ప్రమోషన్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పది రోజులకు ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ పై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి , రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు రమేష్, చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య లు పాల్గొన్నారు.