ఏపీ పీసీబీలో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో 65 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 32 సహాయక పర్యావరణ ఇంజనీర్లు, 33 ఎనలిస్టుల పోస్టులను భర్తీ చేయాలని మండలి నిర్ణయించింది. అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుకు కనీస అర్హత సివిల్, కెమికల్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్. ఎనలిస్టు పోస్టుకు కనీస అర్హత బీఎస్సీ. ఇందులో రసాయన శాస్త్రం సబ్జెక్టు తప్పనిసరిగా ఉండాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.


ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీ పీసీబీ) చర్యలు చేపట్టింది. ఇందులో బాధ్యులైన ఇద్దరు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఈఈగా పని చేస్తున్న వీఆర్ మహేశ్వరరావు తనను వేధిస్తున్నారంటూ అదే ఆఫీసులో సహాయక పర్యావరణ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఓ మహిళాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఈ వ్యవహారంలో ఈఈని విజయవాడలోని కేంద్ర కార్యాలయంలోనూ, ఏఈఈని విజయవాడలోని జోనల్ కార్యాలయంలోనూ తక్షణమే రిపోర్టు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇద్దరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. విజయవాడలోని పీసీబీ కేంద్ర కార్యాలయంలోని మూడో యూనిట్‌లో ఈఈగా పని చేస్తున్న ఎన్‌వీ సాయినాథ్‌కు గుంటూరు కార్యాలయంలో ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా విధులకు సక్రమంగా హాజరుకాని గుంటూరు జిల్లా కార్యాలయంలో ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.