నైపుణ్యాలు పెంచుకుంటేనే భవిష్యత్తు.. యువతకు సూచించిన. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రధర్ బాబు

భవిష్యత్ అవసరాలకు తగిన నైపుణ్యాలు పెంచుకోగలిగితేనే యువత తాము కోరుకున్న ఉద్యోగాలను పొందగలుగుతారని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. కాలానుగుణంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించిన వారే తమ వృత్తులో నిలదొక్కుకోగలుతారని అన్నారు. బుధవారం నాడు టీ-వర్క్స్ ప్రాంగణంలో ‘పాత్ వే టు తైవాన్’ పేరుతో జరిగిన తైవాన్ లో ఉద్యోగాల కల్పనకు జరిగిన మొదటి రౌండ్ ఇంటర్వ్యూల కార్యక్రమాన్ని శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీ- వర్క్స్ సిఇఓ జోగిందర్ తనికెళ్ల, తైవాన్ ప్రభుత్వ సంస్థ టేలెంట్ తైవాన్ ప్రతినిధి ఈడెన్ లియెన్ (Eden Lien) లు మంత్రి సమక్షంలో ఉద్యోగాల కల్పన, ఉన్నత విద్యా కార్యక్రమాలకు సంబంధించిన అవగాహన ఒప్పందం( ఎంఓయు) పై సంతకాలు చేసారు. తైవాన్ కు చెందిన రియల్ టెక్, లాజిటెక్, మీడియాటెక్, విస్ట్రాన్, హిమాక్స్, కౌపాంగ్, ఐటిఆర్ ఐ (Realtech, Logitech, Mediatek, Wistron, Himax, Coupang, ITRI) దీని కోసం ముందుకొచ్చాయి. ఈ ప్రోగ్రాం ద్వారా ఇక్కడి విద్యార్థులను తైవాన్ కంపెనీలు మొదటి రౌండ్ ప్రాధమిక ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకుని తదుపరి దశలో తైవాన్ ను ఆహ్వానిస్తాయి. మొదటి విడతగా 20 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు తొలిదశ ఇంటర్వ్యూల కోసం హాజరయ్యారు. తైవాన్ కంపెనీలు ప్రతిభావంతుల వేటలో దేశం మొత్తం మీద తెలంగాణాను ఎంపిక చేసుకున్నందుకు శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. తొలిదశ ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆరు నెలల పాటు ఇక్కడ (చైనీస్) మాండరిన్ భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆతర్వాత మాండరిన్ భాష, సాంకేతిక పరిజ్ణానాల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు తైవాన్ లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారని ఆయన తెలిపారు. దీని కోసం 8 తైవాన్ కంపెనీలు ఇక్కడికి వచ్చినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా హెచ్ డి ఎఫ్ సి (HDFC) బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్ చల్లవర్ తమ పరివర్తన్ ( CSR) ఫండ్ కింద టీ-వర్క్స్ ఫౌండేషన్ కు రూ.1.5 కోట్ల నిధులను సమకూర్చనున్నట్టు శ్రీధర్ బాబు సమక్షంలో ప్రకటించారు. దీనిని పర్యావరణ అనుకూల విధానాల్లో వస్తూత్పత్తి, ఆవిష్కరణలు చేసే అంకుర సంస్థలకు సహాయనిధిగా అందజేస్తారు. కేవలం 2.2 కోట్ల జనాభా ఉన్న తైవాన్ చిప్ ల తయారీ, టెక్నాలజీ రంగాల్లో ప్రపంచమంతా ఆధారపడే స్థాయికి ఎదిగింది. భవిష్యత్తు టెక్నాలజీల గురించి తైవాన్ ముందు చూపు, శ్రమించే తత్వాన్ని తెలంగాణా యువత ఆదర్శంగా తీసుకోవాలని శ్రీధర్ బాబు సూచించారు. ప్రపంచ అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అనువర్తనం చెందడం వల్లే తైవాన్ కు ఇదంతా సాధ్యమైందని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో తైవానీస్ యూనివర్సిటీలు తమ విద్యాసంస్థల ప్రాముఖ్యతను వివరించే స్టాళ్లను ఏర్పాటు చేసాయి. 12 వ తరగతి, డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు తమ యూనివర్సిటీల్లో చేరితే వారికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని యూనివర్సిటీల ప్రతినిధులు వివరించారు.కార్యక్రమంలో టీ హబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ కల్నల్ టి.ఎం. ప్రవీణ్ కుమార్, తైవాన్ ప్రభుత్వ సంస్థ టేలెంట్ తైవాన్ సిఇఓ జోనాథన్ లియావో, ప్రతినిధులు టెర్రా లిన్, ఇడెన్ లియెన్, హైదరాబాద్ ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొ. శివరామకృష్ణ వంజరి తదితరులు పాల్గొన్నారు.