- శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు
- జాతర నాటికి పూర్తి చేస్తాం
- వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి , రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సమ్మక్క- సారలమ్మజాతర జనవరి నెలలో ప్రారంభం కానున్న నేపధ్యంలో జాతర కోసం శాశ్వత ప్రాతిపదికన విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ ( సీతక్క), ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజుతో కలిసి శుక్రవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ పనులను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను,జంపన్న వాగు వద్ద పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. తొలుత సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పూజుల చేశారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు మరో వందేళ్ల వరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసే విధంగా నిర్మాణాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మేడారం దేవాలయం అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ జాతరకు గిరిజనులు, గిరిజనేతరులు దాదాపు కోటి మందికి పైగా హాజరవుతారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మేడారం ప్రాంగణాన్ని మహా అద్బతంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. జాతర కోసం 50 కిలోమీటర్ల పరిధిలో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ , ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ , ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి,పూజారులు, ఆర్ అండ్ బి, ఇంజనీరింగ్ అధికారులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.