మ‌హాల‌క్ష్మితో లాభాల్లోకి ఆర్టీసీ: ఉప ఉఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

  • మహాలక్ష్ముల ప్ర‌యాణానికి ప్రత్యేక కార్డులు
  • పీఎం ఈ -డ్రైవ్ కింద నిజామాబాద్వ, వ‌రంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు
  • విద్యాసంవ‌త్స‌రం ప్రారంభానికి ముందు బుక్స్, యూనిఫామ్స్, షూస్‌
  • రజక, నాయి బ్రాహ్మణ కులవృత్తుల ఉచిత విద్యుత్ బిల్లుల విడుద‌ల‌

మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ల్ల ఆర్టీసీ లాభాల్లోకి వ‌చ్చింద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. అదే విధంగా ప్రజాప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక సంక్షేమ హాస్టళ్ల‌లోని నిరుపేద విద్యార్థుల‌కు కాస్మోటిక్, మెస్ ఛార్జీల‌ను 200 శాతం పెంచామ‌ని చెప్పారు. ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి కాస్మోటిక్, మెస్ చార్జీల బిల్లుల‌ను చెల్లిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఆదివారం నాడు ప్ర‌జాభ‌వ‌న్ లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారుల‌తో ఉప ముఖ్య‌మంత్రి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రితో పాటుగా మంత్రి పొన్నం ప్ర‌భాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర జాయింట్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు, ఎంజెపి కార్యదర్శి సైదులు, బీసీ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసి బ‌లోపేతం చేసేందుకు, కార్మికుల‌ను ఆదుకునేందుకు ప్ర‌జాప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టినుంచి కీల‌క‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకుంటోంద‌ని అన్నారు. ముఖ్యంగా ఆడ‌బిడ్డ‌ల‌కు బ‌స్సులో ఉచితంగా ప్ర‌యాణించేందుకు తీసుకువ‌చ్చిన మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ల్ల ఆర్టీసీ ల‌భాల్లోకి వ‌చ్చింద‌ని అన్నారు. అంతేగాక మ‌హిళా సంఘాల నుంచి రుణాలు తీసుకోవ‌డంతో పాటుగా, ప్ర‌భుత్వం అందించిన స‌హాకారంతో సంస్థ‌కు కొత్త బ‌స్సులు అందుబాటులోకి వచ్చాయ‌ని చెప్పారు. అంతేకాక బస్ డిపోల ఏర్పాటు, బస్ స్టేషన్ ల అభివృద్ధికి ప్ర‌జాప్ర‌భుత్వం స‌హ‌కారం అందిస్తోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి చెప్పారు. ప్ర‌భుత్వం అందిస్తున్న స‌హకారంతో పాటుగా సంస్థ స్వ‌త‌హాగా నూత‌నంగా ఆదాయా మార్గాల‌ను అన్వేషించాల‌ని ఉప ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు.

ఆర్టీసీ లో మహాలక్ష్మీ ప‌ధ‌కం కింద ఇప్పటి వరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగాయి. మహాలక్ష్మీ పథకం వ‌ల్ల‌ మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నట్లు ఆయ‌న అన్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఆర్టీసీలో పీఎఫ్ బ‌కాయిలు రూ. 1400 కోట్లు ఉండ‌గా.. ప్ర‌జాప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండేళ్ల‌లో రూ. 660 కోట్లకు తగ్గించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. అలాగే సీసీఎస్ బకాయిలు గతంలో రూ.600 కోట్లు ఉండగా ప్ర‌జాప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. రూ.373 కోట్లకు తగ్గించినట్లు తెలిపారు.

ఆర్టీసీ లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కోసం సెంట్రల్ ఫర్ గుడ్ గుడ్ గవర్నెస్ తో ఒప్పందం చేసుకొని ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని అధికారులను బట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ కార్డులు తెలంగాణలోని ప్రతి మహిళకు చేరాలని అధికారులకు ఆయ‌న‌ సూచించారు.ఆర్టీసీలో పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్ లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని వీటికి చార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. పీఎం ఈ -డ్రైవ్ కింద నిజామాబాద్ వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్, షూస్ పంపిణీ చేయాలని అందుకు సంబధించిన నిధులు విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. నాయి బ్రాహ్మణ, రజకకుల సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు లేకుండా చూస్తూ నెల వారిగా ఎప్పటికప్పుడు విడుదల చేయాలని అధికారులు ఉప ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

ప్ర‌జాప్ర‌భుత్వం విద్య‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను తీసుకుంటోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. అందులో భాగంగానే ఒకేసారి వంద ఇంటిగ్రేటెడ్ పాఠ‌శాల‌లను మంజూరు చేసింద‌ని చెప్పారు. గ‌తంలో ఎంజేపిలో 327 గురుకులాలకు కేవ‌లం 26 గురుకులాల‌కు మాత్ర‌మే సొంత భ‌వనాలున్నాయ‌ని చెప్పారు. ప్ర‌జాప్ర‌భుత్వం వంద ఇంటిగ్రేటెడ్ పాఠ‌శాల‌ల‌కు కార్పొరేట్ త‌ర‌హాలో భ‌వ‌నాల‌ను నిర్మిస్తోందని అన్నారు. గురుకులాల స్కూల్ అద్దె కోసం మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీల కోసం రూ.152 కోట్లు విడుదల చేశారని చెప్పారు. గీత వృత్తిదారుల రక్షణకు ఇప్పటి వరకు 30 వేల కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా.. అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టుల నియామకాలకు అనుమతి ఆర్థిక శాఖ నుంచి అనుమ‌తి ఇవ్వాల‌న ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ను ర‌వాణామంత్రి పొన్నం ప్ర‌భాకర్ ఈ సంద‌ర్భంగా కోరారు. అదేవిధంగా మార్చ్ 2026 వరకు 3233 కండక్టర్ పోస్టులు అవసరం ఉండగా తాత్కాలికంగా నియామకాలు జరపడంతో పాటు 50 శాతం రెగ్యులర్ నియామకాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. వాటితో పాటు చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు అనుమతి ఇవ్వాలని కోరారు. అంతేకాక‌ డ్రైవింగ్ లైసెన్స్ ల జారిలో ఉన్న ఇబ్బందులు తేలెత్తకుండా యూజర్ ఛార్జీలకు అనుమతి ఇవ్వాలని కోరారు. రవాణా శాఖ లో ఎన్ఫోర్స్మెంట్ పెంచడానికి కొత్త వాహనాలకు అనుమతి ఇవ్వాలని ,టాక్స్ కలెక్షన్ కోసం ట్యాబ్ లు మంజూరు చేయాలని కోరారు.