పురోగతి లేని ఆయిల్ పామ్ కంపెనీల ఫ్యాక్టరీ జోన్లు రద్దు

  • ఆ జోన్లను ఆయిల్ ఫెడ్ కంపెనీకి కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి కోసం కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లలో ఒప్పంద నిబంధనల ప్రకారం పురోగతి సాధించని కంపెనీలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. పురోగతి లేని ఆయిల్ పామ్ కంపెనీలకు కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లను తగ్గిస్తూ, ఆయా ప్రాంతాలను తెలంగాణ ఆయిల్ ఫెడ్ (TG Oilfed) కు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ఆయిల్ పామ్ (ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ నియంత్రణ) చట్టం, 1993 మరియు నిబంధనలు–2008 ప్రకారం, ఆయిల్ పామ్ కంపెనీలు రైతు నాట్ల నుండి 36 నెలల్లోపు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, ఫ్యాక్టరీ జోన్ పరిధిలో రైతులకు సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే పలు కంపెనీలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, నాట్ల విస్తరణ, నర్సరీ అభివృద్ధి వంటి అంశాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో గౌరవ మంత్రిగారు పలుమార్లు సమీక్షలు నిర్వహించినప్పటికి ఎటువంటి పురోగతి లేకపోవడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు కరీంనగర్ జిల్లాలో కేటాయించిన 44,527 ఎకరాలకు 6721 ఎకరాలలో మాత్రమే ఆయిల్ పామ్ సాగులోనికి తెచ్చినందున, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఫ్యాక్టరీ జోన్‌ను రద్దు చేసి తెలంగాణ ఆయిల్ ఫెడ్‌కు కేటాయించారు. 

మ్యాట్రిక్స్ పామ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కేటాయించిన 30,552 ఎకరాలకు గాను, కేవలం 1606 ఎకరాలు, అదేవిధంగా కేఎన్ బయోసైన్సెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ కు హన్మకొండలోని 9 మండలాలు, వరంగల్ జిల్లాలలోని 2 మండలాలు కలిపి 14000 ఎకరాలు లక్ష్యం ఇవ్వగా, కేవలం 2136 ఎకరాలను మాత్రమే సాగులోనికి తెచ్చారు.  దీంతో ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వారికి ఆయా జిల్లాలలో కేటయించిన ఫ్యాక్టరీ జోన్లను పూర్తిగా రద్దు చేస్తూ, ఆయా ప్రాంతాలను ఆయిల్ ఫెడ్‌కు కేటాయించారు. 

రైతులకు సమయానికి గెలల కొనుగోలు, స్థిరమైన ధర, సమీపంలో ప్రాసెసింగ్ మిల్లుల లభ్యత వంటి అంశాలు అత్యంత కీలకమని మంత్రి పలుమార్లు తెలిపారు. పురోగతి లేని కంపెనీల వద్ద ఫ్యాక్టరీ జోన్లు కొనసాగించడం వల్ల రైతులు నష్టపోతారన్న ఉద్దేశంతో ఆయిల్ ఫెడ్‌కు ఈ జోన్లను కేటాయించే విషయమై పరిశీలించాల్సిందిగా సెక్రటరీ గారిని ఆదేశించడం జరిగింది. 

తెలంగాణ ప్రభుత్వం పంటల మార్పిడి అవసరాన్ని తెలియజేసేలా, వంటనూనెల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ఆయిల్ పామ్ సాగును వ్యూహాత్మకంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO-OP) కింద రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నామని వ్యవసాయశాఖ సెక్రటరీ తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 2.82 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 98,976 ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చింది. 53,709 మంది రైతులకు రూ.297.88 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటికే జమ చేసింది. మంత్రి చొరవతో రాష్ట్రంలో ఆయిల్ ఉత్పత్తి శాతం (OER) 20.01% తో దేశంలోనే అత్యధికంగా ఉంది. ముడి పామ్ ఆయిల్ ఉత్పత్తి సుమారు 70,000 టన్నులు కాగా, ప్రస్తుతం గెలల ధర మెట్రిక్ టన్నుకు రూ.19,694/-గా ఉందన్నారు. “రైతుల సంక్షేమమే ప్రభుత్వ విధానం. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు దీర్ఘకాలిక, స్థిరమైన ఆదాయం కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం. కంపెనీలు ప్రణాళిక ప్రకారం పని చేసి, రైతుల నమ్మకాన్ని పెంచాలి” అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఇంతకు ముందే దిశానిర్దేశం చేశారు.