లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ అందులకు మాత్రమే కాదు, సమాజానికే వెలుగు చూపిన మహనీయుడని పేర్కొన్నారు. అంధత్వాన్ని శాపంగా కాకుండా అవకాశంగా మార్చిన వ్యక్తి బ్రెయిలీ అని, ఆయన ఒక వ్యక్తి కాదని… ఒక ఆలోచన, ఒక ఉద్యమమని అన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుందని మంత్రి తెలిపారు. తాను శాఖ బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు అవుతోందని, ఈ కాలంలో దివ్యాంగుల సమస్యలపై నిరంతర దృష్టి పెట్టి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని చెప్పారు. తాను ఒక మంత్రి మాత్రమే కాదని, దివ్యాంగులకు అన్నలా తోడుగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం పదవ తరగతి వరకే బ్రెయిలీ పుస్తకాలు అందుబాటులో ఉండటంతో అనేక మంది దివ్యాంగ విద్యార్థులు చదువు మధ్యలోనే మానేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే అధికారులతో చర్చలు జరిపామని, రానున్న రోజుల్లో ఇంటర్మీడియట్తో పాటు డిగ్రీ స్థాయి వరకు బ్రెయిలీ పుస్తకాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ దిశగా త్వరలోనే జీవో జారీ చేసి, దివ్యాంగ విద్యార్థులకు పూర్తి స్థాయి విద్యా అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
దివ్యాంగులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను తన పరిధిలో ఉన్న మేరకు వెంటనే పరిష్కరిస్తానని, తన పరిధిలో లేని అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నూటికి నూరు శాతం కృషి చేసి పరిష్కారానికి తీసుకెళ్తానని మంత్రి అన్నారు. ఉద్యోగాలు, రిజర్వేషన్లు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, దివ్యాంగులే గౌరవంతో జీవించే శక్తివంతమైన పౌరులని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల బస్సు ప్రయాణ సమస్యపై వేదికపైనుండే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఫోన్లో మాట్లాడారు. దివ్యాంగులకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన అంధ విద్యార్థులు ఆలపించిన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రొఫెషనల్ గాయకుల స్థాయిలో విద్యార్థులు పాటలు పాడటం అభినందనీయమని మంత్రి పేర్కొంటూ, ఇందుకు కీలకంగా కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. దివ్యాంగులకు సేవ చేయడం దేవుడు ఇచ్చిన గొప్ప వరమని, ఈ సేవ ద్వారా సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు సంబంధించిన సమస్యలు, ఉద్యోగ భద్రత, క్యాడర్ స్ట్రెంత్ అంశాలపై బోర్డు మీటింగ్లో చర్చించి త్వరలోనే పరిష్కారం చూపుతామని తెలిపారు. దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న వివిధ సంఘాలతో అధికారుల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తొలిసారిగా బ్రెయిలీ లిపిలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవిష్కరించారు. అలాగే అంధ పాఠశాల విద్యార్థులకు సంగీత పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు, మహిళా, శిశు,దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ కార్యదర్శి శ్రీమతి అనితా రామచంద్రన్ గారు మరియు దివ్యాంగుల, వయోవృద్ధుల మరియు ట్రాంజెండర్ల సాధికారత శాఖ డైరెక్టర్ శ్రీమతి శైలజ గారు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ అందుల సంఘాల ప్రతినిధులు, దివ్యాంగ అసోసియేషన్ నాయకులు, వివిధ అందుల పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. అంధ విద్యార్థిని విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.
