ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చెస్తే సహించేది లేదు: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • అణాపైసాతో స‌హా వ‌సూలు చేస్తాం
  • ధరణి లోని లొసుగులతో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదు
  • రాష్ట్రవ్యాప్తంగా ఆడిటింగ్ నిర్వహిస్తాం
  • భూభారతి పోర్టల్ లో అక్ర‌మాల‌కు క‌ళ్లెం

హైదరాబాద్ : ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగానికి పాల్పడిన వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం నాడు మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో రెవెన్యూ అధికారులతో సమావేశమైన మంత్రి పొంగులేటి రాష్ట్రంలోని జ‌న‌గాం త‌దిత‌ర ప్రాంతాల్లో బ‌య‌ట‌ప‌డిన స్టాంప్ డ్యూటీ సొమ్ము చెల్లింపుల్లో అక్ర‌మాలపై అధికారుల‌తో స‌మీక్షించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల లావాదేవీలపై ఆడిట్ నిర్వహించ‌గా మొత్తం 52 లక్షల లావాదేవీలలో 4,800 లోపాలు గుర్తించామ‌ని తెలిపారు. వీటిలో దాదాపు 3000 లోపాలు రంగారెడ్డి ,యాదాద్రి జిల్లాల్లో ఉన్నాయ‌న్నారు. వీటికి సంబంధించిన‌ మొత్తాన్ని తప్పకుండా రికవరీ చేస్తామ‌ని తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇటీవల నిర్వహించిన ఆడిటింగ్. లో భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ సొమ్మును పక్కదారి పట్టిన విషయాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమాలకు పాల్పడిన ఘటనపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధరణి పోర్టల్‌లో ఆడిటింగ్ విధానం లేకపోవడమే ఇలాంటి అక్రమాలకు ప్రధాన కారణమని ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి, లోతైన విచారణ జరిపించి బాధ్యులెవరో తేల్చి చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ఈ అక్రమాల్లో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందా లేదా అన్న అంశంపై కూడా లోతైన విచారణ జరపాలని, ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి తేల్చిచెప్పారు. ధరణి పోర్టల్ అమలులోకి వచ్చిన నాటి నుంచి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన అన్ని లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఆడిటింగ్ నిర్వహించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ప్రభుత్వానికి రావలసిన ఒక్క పైసా సొమ్ము దుర్వినియోగం చేసినా సహించేది లేదని స్పష్టమైన హెచ్చరిక చేశారు. ప్రజల సొమ్ముతో ఆడుకున్న వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని, ఇలాంటి అక్రమాలకు ఇకపై తావు ఉండదని మంత్రి స్పష్టం చేశారు.