- అవసరమైన వారికి తగిన వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు
- అధికారులతో సమక్క సారలమ్మ జాతరను నిరంతరం పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం
మేడారం : తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర పకడ్బందీగా కొనసాగుతున్నది. సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లను గురువారం ఉదయం బైక్ లపై జిల్లా కలెక్టర్ దివాకర ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. మేడారం జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు గల ఏర్పాట్లను, పరిసర ప్రాంతాల పారిశుద్ధ్యం స్వయంగా తిరిగి పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చే మహా జాతరలో తప్పిపోయిన వ్యక్తులను తిరిగి వారి కుటుంబానికి చేర్చే దిశగా తప్పిపోయిన వ్యక్తుల ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మేడారం మహా జాతర సందర్భంగా పారిశుధ్య చర్యలు కట్టుదిట్టంగా నిర్వహించడం జరుగుతున్నది. జాతరలో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తుందని అన్నారు. మేడారం పరిసరాలతో పాటు భక్తుల దర్శనానికి వెళ్లే అన్ని సెక్టార్లలో పరిశుభ్రత పాటించడం జరుగుతున్నది, అమ్మవారి గద్దెల వద్ద శానిటేషన్ సిబ్బందితో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టడం జరిగింది, అధికారుల నిరంతర పర్యవేక్షిస్తూ గద్దెల వద్ద బెల్లం, భక్తులు సమర్పించే మొక్కలు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పర్యటనలు మంత్రి వెంట జిల్లా కలెక్టర్ దివాకర, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.