మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టుకు 100 ఎక‌రాలు బ‌ద‌లాయించండి: సీఎం రేవంత్ రెడ్డి

  • గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి రండి
  • ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

మూసీ పున‌రుజ్జీవం.. రైలు మార్గాల మంజూరు… విమానాశ్ర‌యాల ప‌నులు వేగ‌వంత‌మే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది.. ఢిల్లీలో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌, పౌర విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడుల‌తో గురువారం ముఖ్య‌మంత్రి వ‌రుస‌గా భేటీ అయ్యారు. ఆయా ప్రాజెక్టుల‌కు కేంద్ర ప్ర‌భుత్వ అనుమ‌తులు, భూ బ‌ద‌లాయింపులు.. నిధుల మంజూరును కోరుతూనే రాష్ట్ర ప్ర‌భుత్వప‌రంగా ఇవ్వ‌నున్న‌మ‌ద్ద‌తు, భూ కేటాయింపుల‌ను కేంద్ర మంత్రుల‌కు సీఎం వివ‌రించారు.

ఢిల్లీ: ఈసా… మూసీ న‌దుల సంగ‌మ స్థ‌లిలో ప్ర‌పంచ‌స్థాయి విద్యా సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక‌, ప‌ర్యావ‌ర‌ణ కేంద్రంగా నిర్మించ‌నున్నగాంధీ సరోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కేంద్ర మంత్రితో సౌత్ బ్లాక్‌లోని ఆయ‌న కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి గురువారం భేటీ అయ్యారు. సుస్థిర ప‌ట్ట‌ణాభివృద్ధి ల‌క్ష్యాల‌తో ప‌ర్యావ‌ర‌ణ హితంగా, స్వ‌చ్ఛ‌మైన నీటితో న‌ది ప్ర‌వ‌హించేలా మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టును చేప‌డుతున్న‌ట్లు ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వివ‌రించారు. ఈ ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మైన 100 ఎక‌రాల ర‌క్ష‌ణ శాఖ భూముల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌ద‌లాయించాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. ఈసా… మూసీ న‌దుల సంగ‌మ స్థ‌లిలో 1948లో జాతిపిత మ‌హ‌త్మా గాంధీ చిత‌భ‌స్మాన్ని నిమ‌జ్జ‌నం చేసిన బాపూ ఘాట్ వ‌ద్ద గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు చేప‌డుతున్న‌ట్లు సీఎం తెలియ‌జేశారు. గాంధీజీ ఆశ‌యాలైన శాంతి, ఐక్య‌త‌, సుస్థిరాభివృద్ధి, నిరాడంబ‌ర జీవ‌న‌శైలిని అద్దం ప‌ట్టేలా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టును నిర్మించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టును ప్ర‌పంచ‌స్థాయి విద్యా, సాంస్కృతిక‌, ఆధ్యాత్మ‌క‌, ప‌ర్యావ‌ర‌ణ కేంద్రంగా నిలుపుతామ‌ని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టులో శాంతి చిహ్నం, జాతీయ మ్యూజియం, విజ్ఞాన కేంద్రం, చేనేత ప్రోత్సాహ‌క కేంద్రం ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు కు ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులో చేసే శంకుస్థాప‌న‌, భూమి పూజ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. స‌మావేశంలో ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, సురేశ్ షెట్కార్‌, డాక్ట‌ర్ క‌డియం కావ్య‌, గ‌డ్డం వంశీ కృష్ణ‌, ఎం.అనిల్ కుమార్ యాద‌వ్, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కే.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ పాల్గొన్నారు.