హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బుధవారం డాక్టర్ బిఆర్ అంబ్కేదర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు నగర పరిశుభ్రతపై ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సి.ఎస్ కు వివరించారు. సమావేశంలో పరిశుభ్రత, చెత్త సేకరణ విధానం, పరిశుభ్రతా చర్యలు, ప్రజా ఆరోగ్య పరిరక్షణపై తీసుకుంటున్న చర్యలను సి.ఎస్ సమగ్రంగా పరిశీలించారు. వివరాలన్నంటిని ఎప్పటికప్పుడు డాష్ బోర్డ్ లో పొందుపరచాలని సి.ఎస్ ఆదేశించారు. జి.హెచ్.యం.సి పరిధిలో 4500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నాయని, 2650 స్వయం సహాయక బృందాల సభ్యులు మొత్తం 18 వేల 557 మంది శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నారని జి.హెచ్.యం.సి కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. నగర పరిధిలో రోజు వారిగా 7800 టన్నుల మేరకు గార్బేజ్ సేకరణ జరుగుతుందని అన్నారు. మున్సిపల్ విభాగం ప్రభుత్వంలో కీలకమని, ప్రజల అవసరాలకు తగినట్లుగా బాధ్యతలు నిర్వర్తించాలని, అధికారులు విధులలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించమని సి.ఎస్ అన్నారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉండేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. చెత్త సేకరణ (డ్రై, వెట్ వేస్ట్), ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సి.ఎస్ ఆదేశించారు. నగరంలో పారిశుధ్య పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, సమయానుసారంగా నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థలను శుభ్రపరిచే చర్యలు ముందస్తుగా చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి టి.కె.శ్రీదేవి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, జోనల్ కమిషనర్లు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
