రైతు సంక్షేమం – ఆధునిక వ్యవసాయ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, మే 4 నుండి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “రైతు వారం” కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖల అయినా ఉద్యానవన పట్టు పరిశ్రమ , విద్యుత్, మార్కెటింగ్, సహకార, పశుసంవర్ధక ,మత్స్య శాఖ, పౌర సరఫరా నీటిపారుదల సమన్వయంతో రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, శాస్త్రీయ వ్యవసాయం, మార్కెటింగ్, యాంత్రీకరణ, పశుసంవర్ధక మరియు నీటిపారుదల అంశాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించారు.

నేల ఆరోగ్యం – శాస్త్రీయ సాగుకు తొలి అడుగు
మే 4న వికారాబాద్ జిల్లా తాండూరులో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు వారం కార్యక్రమాలను ప్రారంభించారు, సేంద్రియ రైతులు పండించిన పంటల ఉత్పత్తులను క్రయవిక్రయాల కోసం తెలంగాణ రాష్ట్ర విత్తన మరియు సేంద్రీయ ధ్రువీకరణ అధారిటీ డెవలప్ చేసిన టీజీ ఆర్గానిక్స్ మొబైల్ యాప్ గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభించబడింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రైతు వారోత్సవాల్లో 222762 రైతులు,5850 అధికారులు,8157 ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు 14,565 మట్టి నమూనాలను సేకరించి, 20,734 మట్టి విశ్లేషణ పత్రాలను రైతులకు అందజేశారు. నానో ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, సన్న వరి సాగు వంటి అంశాలపై రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించారు వినియోగదారులు కోరుకునే మరియు మార్కెట్లో అధిక డిమాండ్ కలిగిన సన్న వరి రకాలు బీపీటీ 5204 , ఆర్ ఎన్ ఆర్ 15048, హెచ్ఎంటి, జైశ్రీరామ్, కే ఎన్ ఎం.1638, డబ్ల్యూ జి ఎల్ 44, డబ్ల్యూ జి ఎల్ 962, జేజిఎల్ 1798 వంటి రకాలను సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచించారు

ఆధునిక సాంకేతికతతో ఉద్యానవన రంగానికి ఊతం
మే 5న హనుమకొండలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు శ్రీమతి కొండ సురేఖ ఆధ్వర్యంలో మెగా రైతు మేళా నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, ముఖ్యంగా ఆయిల్ పామ్, నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగుపై రైతులకు శిక్షణ ఇచ్చారు. బిందు సేద్యం, నీటి పొదుపు సాంకేతికతల వినియోగంపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
మార్కెటింగ్ సదుపాయాలపై దృష్టి
మే 6న రైతులకు పంట రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు, సహకార సంఘాల సేవలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గోదాముల నిల్వ సదుపాయాలు, కనీస మద్దతు ధర (MSP), మార్కెటింగ్ అవకాశాలపై మార్కెటింగ్ శాఖ అధికారులు రైతులకు వివరించారు.
యాంత్రీకరణ – సౌర విద్యుత్ వినియోగంపై అవగాహన
మే 7న ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ సాంకేతికత ప్రదర్శనలు నిర్వహించారు. రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమాల్లో 1,344 వ్యవసాయ యంత్రాలను ప్రదర్శించారు. 370 మంది రైతుల నుండి యంత్రాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. అలాగే పీఎం కుసుమ్ పథకం కింద సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, సబ్సిడీలపై అవగాహన కల్పించారు.

రైతు వారం కార్యక్రమాల ద్వారా రైతుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించి, వ్యవసాయ ఖర్చులు తగ్గించి, దిగుబడులు మరియు ఆదాయాలు పెంచడం ద్వారా తెలంగాణ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మెగా రైతు మేళలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు పండించిన వరి మొక్కజొన్న జొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటుం దని రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతూ అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయాలని దీనికి ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఈ పంట పండించడం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని వరికి బదులుగా పప్పు దినుసులు కూరగాయ పంటలను పూల మొక్కలను పండించడం ద్వారా అధిక ఆదాయం పొందాలని సూచించారు, ఈ వానాకాలం రైతుల కోసం ముందస్తుగానే ఎరువుల విత్తనాల అందుబాటులో ఉండే విధంగా ప్రణాళిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శన స్టాళ్లను తిలకించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మాత్యులతో పాటుగా మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, ఎంపీ కావ్య శాసనసభ్యులు శ్రీహరి వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ ఐ.ఏ.ఎస్, శ్రీ డా.బి. గోపి ఐ.ఏ.ఎస్ వ్యవసాయ సంచాలకులు వ్యవసాయ శాఖ .ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పశుసంవర్ధక, మత్స్య మరియు నీటిపారుదల రంగాలకు ప్రాధాన్యం
రైతు వారం ఐదవ రోజున పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 593 కృత్రిమ గర్భధారణ క్యాంపులు నిర్వహించి, 35,336 పశువులకు వైద్య పరీక్షలు చేపట్టారు. అదేవిధంగా 2,654 మంది రైతులకు పచ్చిగడ్డి విత్తనాలు పంపిణీ చేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల ఉత్పత్తి పెంపు, చెరువుల నిర్వహణపై రైతులకు అవగాహన కల్పించారు. వేసవిలో పశువుల సంరక్షణ, పచ్చిగడ్డి సాగు, సమగ్ర నీటి వినియోగం, నీటి లభ్యత ఆధారంగా పంటల ప్రణాళికపై వివరించారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో కాలువల మరమ్మత్తులు, చెరువుల పూడికతీత పనులు వేగవంతం చేయడంపై అవగాహన కల్పించారు. చెరువుల గట్లపై పిచ్చిమొక్కలు, కంపచెట్లు, గుర్రపుడెక్క తొలగింపు మరియు కాలువల శుభ్రత కార్యక్రమాల ప్రాముఖ్యత వివరించారు. చెరువుల నల్లమట్టి వినియోగం వల్ల నేల సారవంతం పెరుగుతుందని రైతులకు తెలియజేశారు. మే 9న నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సమతుల్య నీటి వినియోగం, చెరువుల శుభ్రతపై అవగాహన కార్యక్రమాలతో రైతు వారోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఈ రైతు వారోత్సవ కార్యక్రమాలు రైతులకు శాస్త్రీయ అవగాహన ఆధునిక సాంకేతిక ఆర్థిక భరోసా అందిస్తూ వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతున్నాయి రైతు సంక్షేమం ద్వారా తెలంగాణ వ్యవసాయ రంగం మరింత బలపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తుంది.