తెలంగాణలో చెరువులు, వెట్‌ల్యాండ్స్ పరిరక్షణపై ప్రభుత్వం ఫోకస్: మంత్రి కొండా సురేఖ 

తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, సరస్సులు, వెట్‌ల్యాండ్స్ పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల సమీక్షా సమావేశం ఈరోజు (మంగళవారం) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వెట్‌ల్యాండ్స్ అథారిటీ కార్యకలాపాలు, వెట్‌ల్యాండ్స్ కాలుష్య నియంత్రణపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలోని చెరువులు, సరస్సుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమగ్ర వివరాలు సమర్పించారు. ఈ సమావేశానికి అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్, ఫిషరీస్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రాష్ట్రంలోని చెరువులు, సరస్సుల పునరుద్ధరణ, అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించారు. వెట్‌ల్యాండ్స్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. చెరువుల ఆక్రమణలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. అక్రమ నిర్మాణాలు, కాలుష్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. పక్షులు, జలచరాలు, పర్యావరణ సమతుల్యతకు వెట్‌ల్యాండ్స్ కీలకమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో వెట్‌ల్యాండ్స్ పాత్ర అత్యంత ముఖ్యమని, వాటి సంరక్షణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వెట్‌ల్యాండ్స్ మ్యాపింగ్, మానిటరింగ్ ప్రక్రియపై కూడా సమావేశంలో చర్చించారు. చెరువుల స్థితిగతులు, ఆక్రమణలు, కాలుష్య పరిస్థితులపై నిరంతర పర్యవేక్షించాలని అధికారులు అభిప్రాయపడ్డారు. చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భూగర్భ జలాల సంరక్షణలో కూడా వెట్‌ల్యాండ్స్ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెట్‌ల్యాండ్స్ సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, జీవ వైవిధ్య పరిరక్షణలో కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.