- మైన్స్ రెస్క్యూ పోటీల్లో ప్రథమ బహుమతి
- అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డు
- చైనా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల జట్లను వెనక్కినెట్టి ఘన విజయం
- రెస్క్యూ జట్టును అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటిన సింగకేణి రెస్క్యూ జట్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం అభింనందించారు. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సింగరేణి సీఎండీ జ్యతి బుద్ధ ప్రకాష్ తో కలిసి రెస్క్యూ జట్టు మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా వారు సాధించిన ప్రతిష్ఠాత్మక ట్రోఫీలను, మెడల్స్ ను డిప్యూటీ సీఎంగారికి అందించారు. ఈ సందర్భంగా రెస్క్యూ టీం సభ్యులను ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందించారు.
భూగర్భ గనుల రక్షణలో తామెప్పుడూ అగ్రగామినే అని సింగరేణి సంస్థ ప్రపంచ వేదికపై మరోసారి నిరూపించిందన్నారు. జాంబియా దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీలలో (International Mines Rescue Competition) సింగరేణి రెస్క్యూ జట్టు అద్భుత ప్రదర్శనతో విశ్వవిజేతగా నిలివడం సంతోషకరమని అన్నారు. చైనా, కెనడా, ఆస్ట్రేలియా, పోలాండ్, కొలంబియా వంటి గనులు అధికంగా ఉండే దిగ్గజ దేశాల జట్లతో పోటీపడి… భూగర్భ రెస్క్యూ విభాగంలో (Underground Mines Rescue) ప్రథమ బహుమతి కైవసం చేసుకోవడం గర్వకారణమని అన్నారు. గనుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు రెస్క్యూ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి అందించే సేవలు అసమానమైనవని కొనియాడారు.
సింగరేణిని కేవలం ఒక బొగ్గు ఉత్పత్తి సంస్థగానే కాకుండా, అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపేందుకు మా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం అన్నారు. గనుల్లో అత్యంత కఠినమైన పరిస్థితుల్లో పనిచేసే మన రెస్క్యూ సిబ్బంది నైపుణ్యం, అంతర్జాతీయ పోటీల ద్వారా ప్రపంచానికి తెలిసిందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ (పి అండ్ పి) కె. వెంకటేశ్వర్లు, జీఎం (కో-ఆర్డినేషన్, మార్కెటింగ్) టి. శ్రీనివాస్, రెస్క్యూ జీఎం శ్రీనివాసరెడ్డి, రెస్క్యూ జట్టు సభ్యులు మరియు సింగరేణి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.