వికలాంగ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

  • నల్లగొండ ఎక్స్‌రోడ్స్‌లోని దివ్యాంగుల కార్యాలయం, వసతి గృహంపై సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆకస్మిక తనిఖీ
  • విద్య–ఆరోగ్యం–మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్ : రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం, వారి విద్యాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ స్పష్టం చేశారు. గురువారం నల్లగొండ ఎక్స్‌రోడ్స్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం, ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహం, పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యక్షంగా మమేకమైన మంత్రి, మూగ–చెవిటి విద్యార్థులు సంకేత భాష ద్వారా తమ సమస్యలను వివరించగా ఎంతో శ్రద్ధగా ఆలకించారు. విద్యార్థులకు అవసరమైన ప్రతి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. విద్యార్థుల అవసరాలన్నింటినీ సమగ్ర ప్రతిపాదనల రూపంలో ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. శాఖలో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మంత్రి తీవ్రంగా పరిగణించారు. ఖాళీ పోస్టుల వివరాలు, అవసరమైన బోధనా సిబ్బంది, ఇతర సౌకర్యాలపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని సహాయ సంచాలకుడు, విద్యాసంస్థ ప్రిన్సిపాల్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

దివ్యాంగ విద్యార్థుల విషయంలో విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు అనే మూడు అంశాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వసతి గృహంలోని ఆహారం, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, తరగతి గదులు, బోధన సౌకర్యాలు, విద్యార్థుల భద్రత వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తూ, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సేవలు, సామాజిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, సంక్షేమ పథకాల సమర్థ అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి దివ్యాంగ విద్యార్థికి నాణ్యమైన విద్య, మెరుగైన వసతి, అవసరమైన సౌకర్యాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి సమస్యను మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రతిపాదనలను ఆలస్యం చేయకుండా ప్రభుత్వానికి పంపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.