హైదరాబాద్ : ఆగస్టు 15లోగా రాష్ట్రవ్యాప్తంగా 13,046 వ్యవసాయ కుంటల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిషోర్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు (డీఆర్డీఓలు), జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవోలు), జడ్పీ సీఈఓలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వీబీ-జీ రామ్-జీ, తెలంగాణ జలసిరి, గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీఎస్ఏపీ) అమలుపై సమీక్షిస్తూ ప్రతి గ్రామపంచాయతీలో వ్యవసాయ కుంటల గుర్తింపు, పరిపాలనా అనుమతులు, పనుల ప్రారంభాన్ని వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ప్రతి జిల్లాలో కనీసం 50 ఎకో ఫార్మ్ పాండ్లను సెర్ప్-ఎన్ఆర్ఎల్ఎం, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్యశాఖల సమన్వయంతో చేపట్టాలని సూచించారు. తెలంగాణ జలసిరి కింద వ్యవసాయ కుంటలు, ఇంకుడు గుంతలు, పర్కొలేషన్ ట్యాంకులు, బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాలు, బహిరంగ బావుల అభివృద్ధి వంటి నీటి సంరక్షణ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రతిరోజూ తనిఖీలు నిర్వహిస్తూ మండలస్థాయి అధికారులతో నిరంతరం సమీక్షలు చేపట్టి లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికల (జీపీఎస్ఏపీ) మాన్యువల్ తయారీని పూర్తి చేసి, ప్రతి గ్రామపంచాయతీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి మూడేళ్ల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్యతో పాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.