తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి

  • లండన్‌లో తెలుగు ప్రవాసులకి సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు

లండన్‌: ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్‌లో తెలుగు ప్రవాసులకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదివారం ఉదయం లండన్‌లోని తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్‌ ప్రగతిపై ప్రవాసులతో వారు చర్చించారు. తెలుగు సమాజం ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఆత్మీయంగా ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసులు కూడా భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా బలంగా ప్రచారం చేస్తూ, రాష్ట్రానికి మంచి రాయబారులుగా నిలవాలని కోరారు.