మంత్రి కొండా సురేఖ అంశం క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కొండా సురేఖ అంశంపై స్పందించారు. అధిష్ఠానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొన్నారు. అంతర్గత వ్యవహారాలపై మాట్లాడనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ఊహాజనిత కథనాలపై స్పందించనని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఈ సమావేశంలో తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన ఘాటుగా స్పందించారు. దురుద్దేశపూర్వకంగానే తన అమెరికా పర్యటనను కేంద్రం తిరస్కరించిందని తెలిపారు. మరో వైపు మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా గీసుకొండలో ఆమె అభిమానులు వేడుకలు నిర్వహించారు. దీనికి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై క్రమశిక్షణ కమిటీ కూడా స్పందించింది. దాంతో ఆ కమిటీకి కొండా సురేఖ వరుసగా రెండు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ చూస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.